
హైదరాబాద్: ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ ముగిశాక రిటైర్ అవుతున్నట్లు రిచర్డ్సన్ ప్రకటించారు. ఆరు సంవత్సరాలుగా సీఈవో పదవిలో కొనసాగుతున్న రిచర్డ్సన్ రిటైర్మెంట్ విషయాన్ని ఐసీసీ ధృవీకరించింది. 2002లో రిచర్డ్సన్ ఐసీసీ తొలి జనరల్ మేనేజర్ (క్రికెట్)గా ఎంపికయ్యారు. 2012లో ఆయన సీఈవోగా ప్రమోషన్ పొందారు.
గత 16 ఏళ్లుగా రిచర్డ్సన్ క్రికెట్ కౌన్సిల్కు ఎనలేని సేవలు చేశారని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ కొనియాడారు. ఐసీసీ వాణిజ్య పరంగా విజయవంతం కావడంలో ఆయన విశేష కృషి ఉందంటూ మనోహర్ ప్రశంసించారు. ఈ ప్రపంచ కప్ తర్వాత మళ్లీ ఎవరు సీఈవో కావాలనే విషయాన్ని బోర్డు సమావేశంలో చర్చిస్తారని తెలియజేశారు. ఎప్పుడు రిటైర్ కావాలో నిర్ణయించుకోవడం క్రికెటర్కు కష్టమైన అంశం. కానీ నేను మాత్రం వరల్డ్ కప్ ముగిశాక రిటైర్ కావడం సరైందని అనుకుంటున్నట్లు రిచర్డ్సన్ తెలిపారు.
తనకు సహకరించిన ఐసీసీ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారి తోడ్పాటుతోనే అన్ని ఫార్మాట్లలో మంచి విజయాలు రాబట్టగలిగామని పేర్కొన్నారు. వచ్చే 12నెలల్లో క్రికెట్లో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా.. క్రికెట్కు మురింత ఆదరణ పెరుగుతోందనే నమ్మకాన్ని తెలియజేశారు.
దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్సన్ 42 టెస్టులు, 122 వన్డేలు ఆడాడు. వికెట్ కీపర్గా సఫారీల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 1994-95 సీజన్లో న్యూజిలాండ్పై ఏకైక టెస్టు సెంచరీ నమోదు చేశాడు.