IND vs SA: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్-8 పోరులో దక్షిణాఫ్రికా జట్టు భారత్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయంలో వెన్నెముకలా నిలిచిన డేవిడ్ మిల్లర్.. తన అద్భుత బ్యాటింగ్తో భారత బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. భారత్ వంటి పటిష్టమైన జట్టును ఓడించడానికి తాము అనుసరించిన ఫార్మాలా ఏంటో వివరించాడు. ముఖ్యంగా తమ ఆటగాళ్లు తమ పరిధి దాటకుండా ప్రణాళికాబద్ధంగా ఆడటమే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
మా పని మేము చేసుకుంటూ పోయాం..
ప్రారంభంలోనే దక్షిణాఫ్రికా కష్టాల్లో పడినప్పటికీ.. డేవిడ్ మిల్లర్ ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. టీమిండియాను ఓడించడంపై స్పందిస్తూ.. "భారత్ చాలా గొప్ప జట్టు, వారిని ఓడించడం ఎప్పుడూ సవాలే. అయితే ఇలాంటి కీలక టోర్నీల్లో వారిపై విజయం సాధించడం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మేము ఎక్కువగా ఆలోచించలేదు, మా ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉన్నాం. మైదానంలో మా పరిమితులేంటో మాకు తెలుసు, ఆ లైన్ను దాటకుండా మా పని మేము చేసుకుంటూ పోయాం" అని మిల్లర్ చెప్పుకొచ్చాడు.

ఒత్తిడిని ఎలా అధిగమించారంటే?
భారత్తో మ్యాచ్ అంటే సహజంగానే ఉండే భారీ ఒత్తిడిని ఎలా అధిగమించారో కూడా డేవిడ్ మిల్లర్ వివరించాడు. దక్షిణాఫ్రికా జట్టులో చాలా కాలంగా కలిసి ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లు ఉండటం తమకు కలిసొచ్చిందని అతను అన్నాడు. ఐపీఎల్, ఇతర సిరీస్ల వల్ల భారత ఆటగాళ్లతో తమకు మంచి అనుభవం ఉందని.. వారి బలాలు, బలహీనతలు తమకు తెలుసని చెప్పాడు. ఒత్తిడి పెరిగినప్పుడు ప్రశాంతంగా ఉండి, జట్టు వ్యూహాలను అమలు చేయడం వల్లే భారత్పై పైచేయి సాధించగలిగామని మిల్లర్ స్పష్టం చేశాడు.
భారత్ కొంపముంచిన మిల్లర్
ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ ప్రదర్శన విషయానికి వస్తే.. కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో అతను క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో డెవాల్డ్ బ్రెవిస్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించిన మిల్లర్.. ఆ తర్వాత గేర్ మార్చి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు చేసి, జట్టుకు 187 పరుగుల భారీ స్కోరును అందించాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే దక్షిణాఫ్రికా గెలుపు ముంగిట నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చివరికి 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకున్న భారత్, ఇప్పుడు సెమీఫైనల్ చేరాలంటే తన తదుపరి మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కిల్లర్ మిల్లర్ అందించిన ఈ షాక్ నుంచి టీమిండియా ఎంత త్వరగా కోలుకుంటుందో చూడాలి.