
ప్రపంచకప్ మేమే గెలుస్తాం:
ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న మాజీ కెప్టెన్ డారెన్ సామీ.. 'ది హండ్రెడ్' టోర్నీ కోసం స్కై స్పోర్ట్స్ ఛానెల్లో వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాతల మధ్య టీ20 ప్రపంచకప్ 2021 గురించి చర్చ జరిగింది. ఈ క్రమంలో సామీ మాట్లాడుతూ విండీస్ ఈసారి టైటిల్ని గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత మూడు టోర్నమెంట్లలో వెస్టిండీస్ జట్టు చేసిన పరుగుల వరద గురించి కూడా అతడు మాట్లాడాడు. సామీ కెప్టెన్సీలో విండీస్ 2016లో భారతదేశంలో టీ20 ప్రపంచకప్ గెలిచింది. అంతకుముందు వెస్టిండీస్ 2012లో టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది.

అభిమానులకు తెలుసు:
'వెస్టిండీస్ జట్టు కచ్చితంగా ఛాంపియన్ అవుతుంది అది మాత్రమే నాకు తెలుసు. మీరు వెస్టిండీస్ జట్టు చాలా బలహీనంగా ఉందని అనుకోవచ్చు కానీ చివరి నాలుగు టోర్నమెంట్లలో మేము చాలా బాగా ఆడాం. రెండింటిలో విజయం సాధించాం. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. కెప్టెన్ కీరాన్ పొలార్డ్ తిరిగి వచ్చాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, హిట్టర్ ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, ఎవిన్ లూయిస్ల సామర్థ్యం ఏపాటిదో అభిమానులకు తెలుసు' అని డారెన్ సామీ అన్నాడు. విండీస్ తరఫున సామీ 38 టెస్టులు, 126 వన్డేలు 68 టీ20లు ఆడాడు.

రసెల్కే అది సాధ్యం:
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఎవరు ఎక్కువ పరుగులు సాధిస్తారని డారెన్ సామీని అడగ్గా.. మొదటి మూడు స్థానాల్లో బ్యాటింగ్ చేసే వారే పొట్టి టోర్నీలో ఎక్కువ పరుగులు చేస్తారన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ పరుగులు చొయ్యొచ్చని సామీ అభిప్రాయపడ్డాడు. అయితే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ మాత్రం ఆండ్రీ రస్సెల్ గెలవొచ్చన్నాడు. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు అవుతారనే దానిపై నాకు ఎక్కువ ఆసక్తి ఉంది. కీలకమైన సమయాల్లో బౌలింగ్ మరియు బ్యాటింగ్ చేసే ఆండ్రీ రసెల్ లాంటి వ్యక్తి ఆ అవార్డు అందుకోవచ్చు' అని సామీ పేర్కొన్నాడు.

స్వాన్ జోస్యం:
టీ20 ప్రపంచకప్ 2021ను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తాజాగా జోస్యం చెప్పాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్ పొట్టి కప్ను గెలుస్తుందన్నాడు. ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్ను ప్రెజెంటర్ డానిష్ సైట్ అడగ్గా.. 'ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగితే.. కోహ్లీసేననే ఫేవరేట్. కానీ ఇప్పుడు వేదిక మారింది. యూఏఈలో పొట్టి కప్ జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా వెస్టిండీస్ విజేతగా నిలుస్తుంది. విండీస్ నా ఫేవరేట్. విండీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో ఓ పవర్ ఉంది' అని అన్నాడు.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో విండీస్:
టీ20 ప్రపంచకప్లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా, పాపువా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్లకి అర్హత సాధించనున్నాయి. ఇక విండీస్ తన మొదటి మ్యాచ్ని అక్టోబరు 23న ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. 26న దక్షిణాఫ్రికా, నవంబరు 6న ఆస్ట్రేలియాతో తలపడనుంది. క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ని విండీస్ ఆడనుంది.


Click it and Unblock the Notifications












