
హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో గురువారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో పెషావర్ జల్మీ విజయం సాధించింది. గాయంతో బాధపడుతూ క్రీజులోకి వచ్చిన డారెన్ సామీ భారీ షాట్లతో విరుచుకుపడటంతో క్వెట్టా గ్లాడియేటర్స్పై తన జట్టుని విజేతగా నిలిపాడు.
పీఎస్ఎల్లో భాగంగా షార్జా వేదికగా గురువారం పెషావర్ జల్మీ-క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు నిర్ణతీ 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ జల్మీ చివర్లో ఒత్తిడికి లోనైంది.
ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్-మహ్మద్ హఫీజ్లు తొలి వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత పెషావర్ జల్మీ జట్టు వరుసగా వికెట్లను కోల్పోవడంతో చివర్లో ఆ జట్టు విజయానికి 7 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉంది. ఎడమకాలి గాయంతో బాధపడుతున్నా సామీ క్రీజులోకి వచ్చాడు.
ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాది పెషావర్ జట్టు అభిమానుల్లో ఆశలు నింపాడు. ఆ తర్వాత గ్లాడియేటర్ బౌలర్ అన్వర్ అలీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్సర్గా మలిచిన సామీ అదే ఓవర్ నాలుగో బంతిని లాంగాఫ్ దిశగా ఫోర్ బాదాడు.
దీంతో కేవలం 4 బంతులాడిన కెప్టెన్ సామీ 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాది జట్టు విజయానికి కావాల్సిన 16 పరుగులు సాధించడంతో సంబరాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో పెషావర్ జల్మీ నాలుగో స్థానంలో నిలిచింది.