లండన్: ఖాళీ మైదానాల్లో మ్యాచ్లు జరిగితే ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ఆటలో మార్పు రావొచ్చని ఆ దేశ మాజీ పేసర్ డారెన్ గాఫ్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో అభిమానులు లేకపోతే.. స్టోక్స్లాంటి దూకుడైన ప్లేయర్ల ఆటపై ప్రభావం పడుతుందన్నాడు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రేక్షకులను అనుమతించకుండా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాలనే వాదనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో గాఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అమ్మో ఆ బంతి వేస్తే సిక్స్ కొడదామనే.. ధోనీని ఆటపట్టించిన చహర్!!
కరోనా వైరస్ కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన సిరీస్లు మళ్లీ ప్రారంభానికి నోచుకోబోతున్నాయి. గతానికి భిన్నంగా పటిష్ట జాగ్రత్తలతో ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు జరుగబోతున్నాయి. వెస్టిండీస్తో మూడు టెస్టుల సిరీస్కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వబోతున్నది. వైరస్ వ్యాప్తి నిరోధానికి బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ (జీవ రక్షణకు అనుకూలమైన వాతావరణం)లో మ్యాచ్లు నిర్వహించేందుకు ఈసీబీ సిద్ధమైంది.
డారెన్ గాఫ్ తాజాగా మాట్లాడుతూ... 'బెన్ స్టోక్స్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడి ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఇంగ్లండ్ జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గడంలోనూ అతడిది కీలకపాత్ర. అయితే ప్రేక్షకులు లేని ఖాళీ మైదానాల్లో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. ఇది స్టోక్స్ ప్రభావం చూపుతుందనుకుంటున్నా. ప్రేక్షకులు ఉన్నా లేకున్నా కొందరు ఆటగాళ్లకు ఎలాంటి తేడా అనిపించదు. కానీ కొంతమంది మాత్రం అభిమానులుంటేనే బాగా ఆడుతారు' అని గాఫ్ పేర్కొన్నాడు.
కరోనా వైరస్ ప్రభావం తర్వాత జూలై 8 నుంచి వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు సోమవారం ఇంగ్లండ్ బయలుదేరనుంది. విండీస్ ఆటగాళ్లను చార్టెడ్ విమానాల్లో తీసుకురావడంతో మొదలుపెడితే... మూడు వారాల క్వారంటైన్ కల్పించడం వరకు ప్రత్యేకమైన వాతావరణంలో సిరీస్ నిర్వహణకు అన్నీ సిద్ధమయ్యాయి.
వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు బ్రిటన్ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ వెస్టిండీస్, పాకిస్థాన్తో సిరీస్లు నిర్వహించేందుకు ఇంగ్లీష్ బోర్డు ఏర్పాట్లలో మునిగిపోయింది. ఇందులో భాగంగా మూడు మ్యాచ్ల సిరీస్ కోసం రెండు వేదికలు (సౌతాంప్టన్, మాంచెస్టర్) ఎంపిక చేసింది. ఇరు జట్ల మధ్య జూలై 8న తొలి టెస్టు మొదలవుతుంది.