
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్లో ఆడేందుకు ట్రినిడాడ్, టొబాగోకు వెళ్లిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అఫిషియల్స్, ఆర్గనైజర్స్ అందరికి కరోనా నెగటీవ్ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం బయో బబుల్ వాతావరణంలో క్వారంటైన్లో ఉన్న వీరందరికి వరుసగా రెండోసారి పరీక్షలు నిర్వహించగా.. నెగటీవ్ అని తేలింది. దీంతో అన్ని జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి.
సీపీఎల్ 2020లోని కొన్ని జట్లు బయో బబుల్ వెలుపల వారి శిక్షణను కొనసాగించారు. ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లు కీరోన్ పొలార్డ్, డారెన్ బ్రావో, డ్వేన్ బ్రావో, లెండ్ల్ సిమన్స్ మరియు సునీల్ నరైన్ బబుల్ రూల్స్ బ్రేక్ చేసి.. బయట ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మాజీ వెస్టిండీస్ కెప్టెన్, సెయింట్ లూసియా జూక్స్ కెప్టెన్ డారెన్ సామీ మండిపడ్డాడు. కొందరు ఆటగాళ్లను మాత్రమే ఎలా బబుల్ వెలుపల ఆడనిస్తారు అని ట్విట్టర్ వేదికగా సీపీఎల్ యాజమాన్యంను ప్రశ్నించాడు.
ఏ ఆటగాడి పేరు లేదా జట్టు పేరు పెట్టకుండా డారెన్ సామీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రెండు పోస్టులు చేశాడు. 'ప్రతిఒక్కరూ బుడగ (బయో బబుల్)లో ఎందుకు శిక్షణ పొందలేరు. కొందరు బుడగలో ప్రాక్టీస్ చేస్తే.. మరికొందరు బయట చేస్తున్నారు. కోవిడ్ సోకిన ప్రదేశంలో వారికి ఎలా అనుమతిస్తారు. అయితే క్వారంటైన్ లేకుండా బబుల్లో చేరడానికి అందరికి అనుమతించండి' అని మొదటి ట్వీటులో పేర్కొన్నాడు. 'ప్రతిఒక్కరూ మొదటి రోజు నుండి బుడగలో ఉండాలి. ప్రతిఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతకు మీరు హామీ ఇవ్వగల ఏకైక మార్గం ఇదే. అయితే నేను కరోనా నిపుణుడిని మాత్రం కాదు' అని రెండో ట్వీటులో రాసుకొచ్చాడు.
మరోవారం రోజుల్లో (ఆగస్టు 18న) సీపీఎల్ 2020 సీజన్కు తెరలేవనుంది. కరోనా నేపథ్యంలో ట్రినిడాడ్, టొబాగో రెండు వేదికలుగా ప్రేక్షకుల్లేకుండా అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి. గత సీజన్ రన్నరప్ గయాన అమేజాన్ వారియర్స్, త్రీటైమ్ చాంపియన్స్ ట్రినిబాగో నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్తో ఈ లీగ్ తెరలేవనుండగా.. ఫైనల్ సెప్టెంబర్ 10న జరగనుంది.