హైదరాబాద్: ముంబై వేదికగా భారత మహిళలతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మహిళల జట్టు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
ధోని ఇంట్లో టీమిండియా సందడి: డిన్నర్ అదిరిందంటూ చాహల్ ట్వీట్
ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ డానియల్లీ వ్యాట్(64 నాటౌట్; 55 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమెకు తోడుగా లారెన్ విన్ఫీల్డ్(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) ఫరవాలేదనిపించింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.
భారత జట్టులో మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) నిరాశపరచగా... మిథాలీ ఒక్కతే 20 పరుగులతో టాప్ స్కోరరగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఐదుగురు భారత్ బ్యాట్స్ఉమెన్ సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.
ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రంట్ మూడు వికెట్లు తీయగా... లిన్సే స్మిత్ రెండు వికెట్లు... కేట్ క్రాస్, ష్రబ్సోల్లకు తలో వికెట్ తీశారు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా తొలి టీ20లో ఇంగ్లాండ్ మహిళల జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.