వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని, టీమిండియా పాకిస్థాన్కు వెళ్లదని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు భారత్ తమ దేశానికి రావాలని ఐసీసీని పాక్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేస్తోంది.
అయితే ఐసీసీ ఛైర్మన్గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఎన్నిక కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్కు రావొద్దని, దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో భారత్ మ్యాచ్లు నిర్వహించాలని పేర్కొన్నాడు. తమ దేశంలో ఆటగాళ్ల భద్రత పెద్ద ఆందోళన అని అన్నాడు.

''పాకిస్థాన్ పరిస్థితిని చూస్తుంటే.. భారత జట్టు పాకిస్థాన్కు రావొద్దనే చెబుతాను. పాకిస్థాన్ కూడా దీని గురించి ఆలోచించాలి. దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా. ఆటగాళ్ల భద్రతనే మొదటి ప్రాధాన్యత. గౌరవం అనేది రెండో ప్రాధాన్యతగా చూడాలి''
''బీసీసీఐ గొప్పగా తన పనిచేస్తోంది. వాళ్ల నిర్ణయం ఏదైనా సరే, ఇతర దేశాలు కూడా దీన్ని అంగీకరించాలి. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతుందని అనుకుంటున్నాను. కాగా, పాక్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే పీసీబీ ముందుగా మౌళిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలి. పాక్లో భద్రత పెద్ద ఆందోళన, అంతేగాక పెద్ద ప్రశ్నార్థకరం'' అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.
షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరాచీ, గడాఫీ, రావల్పిండి స్టేడియాలను పీసీబీ ఆధునీకరిస్తోంది. దీని కోసం 12.80 బిలియన్ల రూపాయలను వెచ్చించనుంచి.