
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఫలితం తేలడం చాలా కష్టమని, ఈ మ్యాచ్ కచ్చితంగా డ్రా అవుతుందని పాక్ మాజీ లెజెండ్ దానిష్ కనేరియా అంటున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లో కనేరియా విశ్లేషించాడు. ఇక్కడి పిచ్ నుంచి బౌలర్లకు అంత గొప్పగా సహకారం లభించడం లేదని, దీంతో ఈ మ్యాచ్లో ఫలితం రావడం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా కనుక బంతితో చెలరేగితేనే ఫలితం రావొచ్చని వివరించాడు.
'ఈ టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. దీనిలో ఏదైనా ఫలితం వస్తుందని నేను అనుకోవడం లేదు. మూడో రోజు ఆసీస్ బౌలర్లు చెలరేగి, భారత జట్టును తొందరగా ఆలౌట్ చేసేస్తే ఫలితం రావొచ్చు. కానీ ఈ వికెట్ నుంచి బౌలర్లకు ఏ సహకారం దొరకడం లేదు.
పెద్దగా టర్న్ కూడా లేదు' అని చెప్పాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ శతకాలతో చెలరేగారు. దీంతో ఆ జట్టు 480 పరుగుల భారీ స్కోరు చేసింది. బదులుగా భారత జట్టులో కూడా శుభ్మన్ గిల్ కూడా సెంచరీ చేశాడు.

ఈ మ్యాచ్ ఆరంభంలో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ కేఎస్ భరత్ జారవిడిచాడు. దీంతో అతన్ని నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. దీనిపై కూడా స్పందించిన కనేరియా.. భరత్ అద్భుతంగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడని, దీనికి అతన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు.
'చాలా మంది ఆ కుర్రాడిని విమర్శించారు. అలా చేసుండాల్సింది కాదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్లలో అతను కూడా ఒకడు. కామెరూన్ గ్రీన్ను అవుట్ చేయడానికి భరత్ అందుకున్న క్యాచ్ అద్భుతం. చాలా కిందకు వంగి కూర్చున్నాడు. అలా చేయడం అంత ఈజీ కాదు' అని వివరించాడు.