
తప్పకుండా భారత్కి వస్తా:
రామ్ మందిర్ భూమి పూజపై డానిష్ కనేరియా ట్వీట్ చేయడంతో.. అతనికి ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియా టీవీతో కనేరియా మాట్లాడుతూ... 'ఓ హిందువుగా నేను రాముడిని ఆరాధిస్తాను. చిన్నప్పటి నుంచే రాముడు అంటే నాకు ఇష్టం. రామాయణాన్ని చూశా. రాముడు చూపిన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తా. అతను జీవించిన విధానం నాకు ఆదర్శం. రామ్ మందిర్పై నేను చేసిన ట్వీట్ ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. రాముడిని ఆరాధిస్తాను కాబట్టే.. ట్వీట్ చేశా. ఒకవేళ రాముడు కరుణిస్తే.. రామ్ మందిర్ని చూసేందుకు తప్పకుండా భారత్కి వెళ్తా' అని కనేరియా చెప్పాడు.

రెండో హిందూ ఆటగాడు:
'శ్రీరాముడిలోని అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగిఉంది. చెడుపై మంచి గెలుస్తుందనడానికి అతనో సూచిక. రామ మందిరానికి భూమి పూజ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషించారు. ఆత్మ సంతృప్తికి ఇదో గొప్ప కార్యం' అని డానిష్ కనేరియా తన ట్వీట్లో పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ అనిల్ దల్పత్ తర్వాత కనేరియానే పాక్ జట్టులో ఆడిన రెండో హిందూ ఆటగాడు. హిందువు అనే కారణంగానే కనేరియా వివక్షకి గురైనట్లు ఇటీవల మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వెలుగులోకి తెచ్చాడు. వివక్షకి గురైనట్లు కనేరియా కూడా చెప్పడంతో.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు చాలా మంది అహానిపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఎందుకు నోరు విప్పలేదంటూ? మండిపడ్డారు.

కౌంటీ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్:
2000లో పాక్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్ర చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. జట్టులో చోటు కోసం చాలా రోజులు నిరీక్షించిన కనేరియా.. అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్లో ఎస్సెక్స్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు. ఇక 2009లో డర్హామ్పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్ఫీల్డ్తో కలిసి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. వెస్ట్ఫీల్డ్ తనను ఓ వన్డే గేమ్లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు.

చేతులెత్తేసిన పీసీబీ:
ఆటకు దూరమైనప్పటి నుంచీ జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నానని, కుటుంబ పోషన కోసం మళ్లీ క్రికెట్ ఆడాలనుందని, పీసీబీ చొరవ తీసుకొని అవకాశం కల్పించాలని డానిష్ కనేరియా పలుమార్లు కోరాడు. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని పీసీబీ స్పష్టం చేసింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డే అతడికి శిక్ష విధించిందని, అక్కడే సంప్రదించాలని పీసీబీ ఇటీవల కనేరియాకు సూచించింది. దీంతో కనేరియాకు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు.
మాక్స్వెల్ ఐపీఎల్ ఎలెవన్.. మోహిత్కు చోటు.. రోహిత్కు షాక్!!


Click it and Unblock the Notifications












