Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. అయితే తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ జట్టు.. మెగా వేలంలో ఓ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడిందని, కానీ కొనుగోలు చేయలేక పోయిందని చెప్పాడు.
అతడెవరంటే?
గుజరాత్ టైటాన్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవిశ్రీనివాసన్ సాయి కిశోర్ ప్రదర్శన తనను బాగా ఆకట్టుకుందని తెలిపాడు హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి. "కిశోర్ కు మంచి భవిష్యత్ ఉంది. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ముంబై జట్టులో మిచెల్ శాంట్నర్, పంజాబ్ కింగ్స్ తరఫున హర్ప్రీత్ బ్రార్ మంచిగా ఆడుతున్నారు. ఇక సాయి కిశోర్ అద్భుతం. మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు బాగా ప్రయత్నించాం. చాలా దగ్గరి వరకు వెళ్లాం. అతడు మా జట్టులో ఉండాలని కోరుకున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మంచి బౌలర్కు కావాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అతడు చాలా ధైర్యంగా ఆడతాడు. బంతిని బాగా తిప్పగలిగే సామర్థ్యం ఉంది. పేస్ మార్చగలిగే సామర్థ్యం ఉంది. ఇతడు ఆడే విధానం.. ఇతర స్పిన్నర్లుకు ఓ టెంప్లెట్ సెట్ చేస్తుంది. పోటీ పడి మరీ ఎలా విజయం సాధించొచ్చో అతడు చూపించగలడు. మంచి బ్యాటింగ్ పిచ్లపై కూడా అతడు మంచి ప్రదర్శన చేశాడు," అని వెట్టోరీ పేర్కొన్నాడు.

ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్ వర్సెస్ హైదరాబాద్ జట్టు మధ్య జరిగిన మ్యాచులో కిశోర్.. నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ వికెట్లు తీశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చాడు. దీని గురించి వెట్టోరీ మాట్లాడుతూ.. "అతడు హైదరాబాద్ కు వచ్చి మా జట్టుపై అద్భుతంగా, అసాధారమైన బౌలింగ్ చేశాడు. అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని నేను అనుకుంటున్నాను." అని వెట్టోరి అన్నాడు. కాగా, వేలంలో గుజరాత్ టైటాన్స్.. రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి కిశోర్ ను రూ.2 కోట్లకు దక్కించుకుంది. అతడు 8 మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు.
సన్ రైజర్స్ స్పిన్ అటాక్ ప్రదర్శన..
హైదరాబాద్ జట్టు స్పిన్ విభాగం.. ఈ సీజన్ లో ఇప్పటివరకు అంతగా రాణించలేదు. ఓవర్సీస్ లెగ్ స్పిన్నర్ అడం జంపా గాయం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. రాహుల్ చాహర్ కేవల ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఏడు మ్యాచులో ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. మొత్తంగా 9 మ్యాచుల్లో మూడు విజయాలు అందుకుంది. తమ నెక్ట్స్ మ్యాచును నరేంద్ర మేదీ స్టేడియంలో మే2న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.