ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు భారత్ సన్నద్ధమవుతోంది. రేపటి నుంచి ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే అందరి చూపు టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్పైనే ఉంది. తన కెరీర్ ఆరంభంలోనే రికార్డులు బద్దలు కొడుతూ భవిష్యత్ స్టార్గా గిల్ భరోసా ఇచ్చాడు. కానీ గత కొంతకాలంగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వన్డేలు మినహా టెస్టులు, టీ20ల్లో పూర్తిగా తేలిపోతున్నాడు.
ఈ నేపథ్యంలో గిల్ స్థానంపై చర్చలు మొదలయ్యాయి. టీ20 తుది జట్టులో ఇప్పటికే అతడు చోటు కోల్పోయాడు. ఇటీవవల జరిగిన అఫ్గానిస్థాన్ సిరీస్లో బ్యాకప్ ఓపెనర్గా మాత్రమే గిల్ ఆడాడు. యశస్వీ జైశ్వాల్ అనారోగ్యంతో దూరమవ్వడంతో తొలి మ్యాచ్లో మాత్రమే అతడికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత బెంచ్కే పరిమితమయ్యాడు.

ఇప్పుడు గిల్ అసలు పరీక్షను ఎదుర్కోనున్నాడు. టెస్టు జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్ సిరీస్లో తప్పక సత్తాచాటాల్సి ఉంది. అయితే టెస్టుల్లో ఓపెనర్గా గిల్కు కాస్త మెరుగైన రికార్డు ఉంది. కానీ జైశ్వాల్ రాకతో మూడో స్థానంలో గిల్ ఆడుతున్నాడు. వన్డౌన్లో అయిదు టెస్టులు ఆడిన గిల్ 23 సగటుతో 166 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 47 మాత్రమే. మరోవైపు గిల్కు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పరోక్షంగా హెచ్చరించాడు. గిల్ ఫామ్లోకి రావాలని, ఎంతో మంది యువకులు ఛాలెంజిగ్ వికెట్లపై సత్తాచాటుతున్నారని పేర్కొన్నాడు.
'' గిల్ మంచి ప్లేయర్. స్టార్ క్రికెటర్లగా ఎదగడానికి కాస్త సమయం పడుతుంటుంది. కానీ కొంతమంది ప్లేయర్లు త్వరగా పేరు సంపాదించుకుంటారు. గిల్ తన ప్రారంభ రోజుల్లోనే సత్తాచాటి ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా గత రెండు, మూడేళ్లలో కఠినమైన పిచ్లపైనే ఆడింది. అయితే భారత్, ఇంగ్లాండ్ లేదా వెస్టిండీస్ వంటి ఛాలెంజింగ్ వికెట్లపై ఎంతో మంది యువకులు రాణిస్తున్నారు'' అని ద్రవిడ్ అన్నాడు. మూడో స్థానంలో గిల్ విఫలమవ్వడంపై ద్రవిడ్ స్పందిస్తూ.. గిల్ సరైన మార్గంలో ఉన్నాడని భావిస్తున్నట్లు తెలిపాడు. తిరిగి ఫామ్లోకి రావడానికి గిల్ తీవ్రంగా శ్రమిస్తున్నాడని చెప్పాడు.