IPL 2025 CSK vs KKR: ఐపీఎల్ 2925లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది వరుసగా ఐదో ఓటమి. ఈ సీజన్లో సీఎస్కే ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడింది. అందులో సీఎస్కే వరుసగా 5 మ్యాచ్ల్లో పరాజయాలను చవిచూసింది. సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కు ముందు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశాడు. అది సీఎస్కే ఓటమి తర్వాత వైరల్గా మారింది.
డేల్ స్టెయిన్ పోస్ట్ ఏమిటి?
ఐపీఎల్ 25వ మ్యాచ్ సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య శుక్రవారం రాత్రి చెపాక్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కు ముందు డేల్ స్టెయిన్ తన ఎక్స్ ఖాతాలో "ఈ లీగ్లో నిజంగా ఉండకూడని కొంత మంది వ్యక్తులు ఉన్నారు." అని రాసుకొచ్చారు. డేల్ స్టెయిన్ తన పోస్టులో ఏ జట్టు లేదా ఆటగాడి పేరును పేర్కొనలేదు. కానీ కొంతమంది నెటిజన్లు ఇప్పుడు దానిని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి లింక్ చేస్తున్నారు. డేల్ స్టెయిన్ పోస్ట్ పై చాలా మంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

చెన్నై జట్టును ఎగతాళి చేస్తున్నారు..
ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. బ్యాటింగ్ నుంచి బౌలింగ్ వరకు చాలా మంది ఆటగాళ్లు పరాజయాలు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్ లో ధోని మునుపటిలా పూర్తి చేయలేకపోతున్నాడని చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనితో పాటు మెగావేలంలో ఆటగాళ్లు ఎంపిక కోసం కూడా సీఎస్కేను ట్రోల్ చేస్తున్నారు. సీజన్ సగం వరకు వస్తుండగా సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి సీఎస్కే ప్లేఆఫ్స్ కు చేరుకోవడం చాలా కష్టమని భావిస్తున్నారు. సీఎస్కేకు ఇంకా 8 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వాటిలో జట్టు 7 మ్యాచ్ లను గెలవాలి. అది అంత సులభమేమీ కాదు. ఈ క్రమంలో ఈ సారి సీఎస్కే ఇంటి బాట పట్టడం ఖాయమని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.