
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ సరిగ్గా సగం మ్యాచ్లు పూర్తయ్యాక పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దాంతో మిగతా సీజన్ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నిరవధికంగా వాయిదా వేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ సీజన్ ఐపీఎల్ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ రద్దు కావడంతో విదేశీ ఆటగాళ్లంతా ఎవరి దేశానికి వారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్లో పాల్గొనడానికి వచ్చిన విదేశీ ఆటగాళ్లను తమ స్వదేశాలకు పంపించడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా పేర్కొన్నారు.
ఇక డేవిడ్ వార్నర్కు తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది లాక్డౌన్ సమయంలో వార్నర్ తన ఫ్యామిలీతో కలిసి టిక్టాక్ వీడియోలతో అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా వార్నర్ కూతుర్లు ఇవీ, ఇండీ, ఇస్లాలు తన తండ్రిని మిస్ అవుతూ గీసిన ఒక డ్రాయింగ్ వైరల్గా మారింది. దీనికి సంబంధించిన దానిని వార్నర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. 'ప్లీజ్ డాడీ.. ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేయ్. నిన్ను చాలా మిస్సవుతున్నాం. లవ్ యూ డాడీ. ఫ్రమ్ ఇండీ, ఇవీ, ఇస్లా' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ డ్రాయింగ్ను ఇవీ గీసిందని వార్నర్ చెప్పాడు.
ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అటు బ్యాట్స్మెన్గా ఇటు కెప్టెన్గా విఫలమవుతున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్పై వేటు వేసింది. కేన్ విలియమ్సన్ సారథిగా ప్రకటించింది. డేవిడ్ వార్నర్ 2014లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్లో సన్రైజర్స్కు అదే ఏకైక టైటిల్. ఆ తర్వాతి ఏడాది ప్లేఆఫ్స్ చేర్చాడు. బాల్ టాంపరింగ్ నిషేధం కారణంగా 2018 సీజన్కు దూరమయ్యాడు. 2019లో ఆటగాడిగానే కొనసాగినా.. తిరిగి కెప్టెన్గా బాధ్యతలు అందుకుని మరోసారి సన్రైజర్స్ను ప్లేఆఫ్స్ తీసుకెళ్లాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో ఏడు మ్యాచ్లాడిన సన్రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్ల్లో ఓడిపోవడం ద్వారా ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టంగా హైదరాబాద్ మార్చుకుంది. ప్లేఆఫ్ వెళ్లడం దాదాపు అసాధ్యమే. తాజాగా ఐపీఎల్ 2021 వాయిదాతో సన్రైజర్స్ జట్టు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫన్నీగా మీమ్స్, కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ సంతోషించే వార్త అంటూ నెటిజన్లు జోక్లు వేస్తున్నారు. 'ఐపీఎల్ రద్దవ్వడం వల్ల అత్యంత సంతోషపడే వ్యక్తి కావ్య మారన్' అని అభిమాని ట్వీట్ చేయగా.. 'హమ్మయ్య.. ఐపీఎల్ రద్దయింది. మా సన్రైజర్స్ బతికిపోయింది' అని ఇంకొకరు పేర్కొన్నారు.