
బర్మింగ్హామ్: వచ్చే ఏడాది బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్ అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నిర్వహకులు మంగళవారం ప్రకటించారు. కామన్వెల్త్ గేమ్స్ మహిళల టీ20 పోటీలు జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగుతుందని నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2022 కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి షెడ్యూల్ను కామన్వెల్త్ అధికారిక వెబ్సైట్లో నిర్వహకులు పొందుపరిచారు.
మహిళల టీ20 క్రికెట్లో ఎనిమిది జట్లు గ్రూప్ దశలో తలపడనున్నాయి. ఆగస్టు 4 వరకు గ్రూప్ దశ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆగస్టు ఆరో తేదీన సెమీస్ పోరు ఉంటుంది. కాంస్య పతకానికి సంబంధించిన మ్యాచ్ను ఆగస్టు 7న జరగనుంది. అదే రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లండ్ సహా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఆరు జట్లు నేరుగా ఈ గేమ్స్ పాల్గొనేందుకు అర్హత సాధించనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళల జట్టు ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. మిగిలిన ఒక బెర్త్ కోసం అర్హత పోటీలు నిర్వహించారు.
ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళల జట్టు మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్కు ప్రాతినిధ్యం లభించడం ఇది తొలిసారేమీ కాదు. 1998 కౌలాలంపూర్లో జరిగిన క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా పాల్గొంది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల చేత సీడబ్యూజీలో క్రికెట్కు ప్రాతినిధ్యం దక్కలేదు. తిరిగి 24 ఏళ్ల తర్వాత ఈ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్లు జరుగనున్నాయి.
2022 కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి షెడ్యూల్ను కామన్వెల్త్ అధికారిక వెబ్సైట్లో నిర్వాహుకులు పొందుపరిచారు. స్విమ్మింగ్, డైవింగ్కు 11 రోజులు, క్రికెట్కు 8 రోజులు, జిమ్నాస్టిక్స్కు 8 రోజులు, అథ్లెటిక్స్తో పాటు మారథాన్కు 7 రోజుల చొప్పున కేటాయింపులు చేశారు. కామన్వెల్త్ గేమ్స్ కోసం ఇప్పటినుంచే ప్లేయర్స్ సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.