వరల్డ్ కప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయతే ఈ మ్యాచ్లో టీమిండియాకు కష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ అద్భుతమైన ఫామ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్లో ఆడుతున్న షహీన్.. బంతితో చెలరేగుతున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
కొన్నిరోజుల క్రితం జరిగిన మ్యాచ్లో తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసుకొని సంచలనం సృష్టించాడు. ఆ షాక్ నుంచి ఫ్యాన్స్ తేరుకునేలోపే మరో అద్భుతమైన ప్రదర్శన చేశాడీ పాక్ పేస్ సంచలనం. నాటింగ్హామ్ అవుట్లాస్ తరఫున ఆడుతున్న షహీన్.. లీసెస్టర్షైర్ ఫాక్సెస్తో జరిగిన మ్యాచ్లో తొలి లీగల్ డెలివరీకే వికెట్ తీశాడు. అంతకుముందు బర్మింగ్హాం బేర్స్తో జరిగిన మ్యాచ్లో కూడా తొలి లీగల్ డెలివరీకే వికెట్ తీసుకున్నాడు.

బర్మింగ్హాం టీంకు చెందిన అలెక్స్ డేవీస్ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన షహీన్.. ఇప్పుడు లీసెస్టర్షైర్తో మ్యాచ్లో పీటర్ హాండ్స్కోంబ్ను పెవిలియన్ చేర్చాడు. ఇలా వరుసగా రెండు మ్యాచుల్లో తొలి బంతికే వికెట్ తీసుకొని సంచలనం సృష్టించాడు. ఇది చూసిన పాక్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. గతేడాది గాయంతో ఆటకు దూరమైన షహీన్.. టీ20 వరల్డ్ కప్లో పెద్దగా ప్రభావం చూపలేదు.
అతను పూర్తిగా కోలుకోకుండానే వరల్డ్ కప్ ఆడించడంతో షహీన్ గాయం తిరగబెట్టింది. దానికితోడు ఫైనల్లో డైవ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో మరో నాలుగు నెలలపాటు ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. అయితే సరిగ్గా వన్డే వరల్డ్ కప్కు ముందు అతను సూపర్ ఫామ్ అందుకోవడం చూసిన పాక్ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. భారత్పై కూడా అతను చెలరేగుతాడని భావిస్తున్నారు.
యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో షహీన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చాలా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఆ మ్యాచ్లో దారుణంగా ఫెయిలవడంతో భారత జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో పాక్ చేతిలో దారుణంగా పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు షహీన్ ఫామ్ చూస్తే అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉందని పాక్ ఫ్యాన్స్ అంటున్నారు.