ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో నేడు బిగ్ డే. సెమీ ఫైనల్స్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు, రేపు రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి సెమీ ఫైనల్స్లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీనికి వేదిక.. ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
రెండో సెమీస్ కోల్కత ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. 19వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండింటిపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. టీమిండియా గెలిచి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఇంగ్లాండ్లో 2019లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో ఇదే న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. పైగా ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్లల్లో న్యూజిలాండ్ను ఓడించిన చరిత్ర టీమిండియాకు ఎప్పుడూ లేదు. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. న్యూజిలాండ్ గండాన్ని ఎలా అధిగమిస్తుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
ఈ సమయంలో ఓ సరికొత్త వివాదానికి తెర తీసింది బీసీసీఐ. మొదట నిర్దేశించిన సెమీఫైనల్ పిచ్ను మ్యాచ్కు ముందు మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీకి చెందిన ఇండిపెండెంట్ పిచ్ కన్సల్టెంట్ ప్రతిపాదించిన విధంగా కాకుండా ఇందులో టాంపరింగ్ చేసిందనే కథనాలు బయటికొచ్చాయి.
ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లలో పిచ్లన్నీ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటాయి. దీనిపై హోమ్ బోర్డుకు అట్కిన్సన్ ఓ నివేదికను సమర్పిస్తాడు. సెమీఫైనల్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న వాంఖెడే పిచ్.. మొదట్లో ఎంపిక చేసిన అట్కిన్సన్ రిపోర్ట్కు వ్యతిరేకంగా ఉందనేది సరికొత్త వివాదం. దీన్ని బీసీసీఐ తోసిపుచ్చింది.