ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి సెమీ ఫైనల్స్ మొదలైంది. టీమిండియా టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ కీలకంగా మారిన ఈ మ్యాచ్లో.. అందరి అంచనాలకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్కే మొగ్గు చూపాడు కేప్టెన్ రోహిత్ శర్మ.
అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. పిచ్ బాగుందని కితాబిచ్చాడు. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ మందకొడిగా మారొచ్చని అంచనా వేశాడు. ఇంగ్లాండ్లో 2019 నాటి సెమీ ఫైనల్స్ తనకు గుర్తుకు వస్తోందని, ఇదే న్యూజిలాండ్తో గట్టిగా పోరాడామని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయట్లేదని, కొన్ని సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తోన్న జట్టుగా గుర్తింపు ఉందని చెప్పాడు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు.

పిచ్ బ్యాటింగ్, బౌలింగ్కు అనుకూలంగా ఉందని, జట్టులో ఎలాంటి మార్పులు చేయదలచుకోలేదని రోహిత్ శర్మ చెప్పాడు. జట్టు సమతౌల్యంగా ఉందని అభివర్ణించాడు.
న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ- టాస్ గెలిచి ఉంటే తాము మొదట బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లమని అన్నాడు. పిచ్ బాగుందని, ఆశాజనకంగా ఉందని పేర్కొన్నాడు. సాయంత్రానికి కొంత మంచు పడే అవకాశం ఉందని, ఇది తమ ముందు ఉన్న సవాల్గా మారుతుందని అన్నాడు.
భారత్ తుదిజట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.
న్యూజిలాండ్ టీమ్లో- డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిఛెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్మన్, మిఛెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ను తుది జట్టులోకి తీసుకున్నారు.