ఫామ్లో లేకున్నా..:
ఐసీసీ టోర్నీలంచే ధావన్ ఆట తీరే పూర్తిగా మారిపోతుంది. అంతకముందు వరకు ఫామ్లో లేకున్నా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం అనూహ్యంగా చెలరేగిపోతాడు. 2015 ప్రపంచకప్తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో ధావన్ చెలరేగి ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో సఫారీలతో జరిగిన తొలి మ్యాచ్లో నిరాశ పరిచిన ధావన్.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
6వ సెంచరీ:
ఐసీసీ టోర్నీల్లో ధావన్కి ఇది 6వ సెంచరీ. ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో ఇప్పటివరకు మొత్తం 20 మ్యాచ్లాడిన ధావన్.. 65.15 యావరేజితో 1238 పరుగులు చేశాడు. తాజా సెంచరీతో ఐసీసీ టోర్నమెంట్లలో కుమార సంగక్కర, రికీ పాంటింగ్లతో సమానంగా ధావన్ ఆరు శతకాలు సాధించాడు. సచిన్, సౌరభ్ గంగూలీ ఏడు శతకాలతో ముందున్నారు.
ఏదో సాధించావ్ అనే తృప్తి ఉంటుంది:
ఈ నేపథ్యంలో సచిన్ మాట్లాడుతూ.. 'నా పేరిట ఉన్న రికార్డుని ధావన్ ఈ ప్రపంచకప్లో అధిగమించాలని కోరుకుంటున్నా. ఇది జరిగితే టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుంది. ధావన్ పరుగులు చేస్తే.. భారత బౌలర్లు ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఈ రోజు ధావన్ అద్భుత శతకం సాధించాడు. దీంతో అతను చాలా సంతోషించిండొచ్చు. హోటల్ రూమ్కి వెళ్లాక అద్దంలో చూసుకుంటే ఈ రోజు నువ్వు ఏదో సాధించావ్ అనే తృప్తి అతనికి ఉంటుంది' అని సచిన్ పేర్కొన్నారు.
బ్యాటింగ్ కొనసాగించిన తీరు అద్భుతం:
'భారత్ తరఫున ఆడడం గొప్ప గౌరవం. గాయాలు ప్రతి ఒక్కరికి సాధారణమే. అయితే శిఖర్ ధావన్ చేతి వేలుకు బలంగా బంతి తాకింది. అయినా నొప్పిని భరిస్తూ.. బ్యాటింగ్ కొనసాగించిన తీరు అద్భుతం. అతనో గొప్ప ఫైటర్. శిఖర్ బ్యాటింగ్ నన్ను ఆశ్చర్యానికి ఏమీ గురిచేయలేదు' అని సచిన్ చెప్పుకొచ్చారు.