
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్కు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. భారత జట్టు యాజమాన్యం గబ్బర్ చేతి వేలికి స్కానింగ్ చేయించనుంది. స్కానింగ్ అనంతరం వచ్చిన రిపోర్టులను బట్టి గురువారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో గబ్బర్ ఆడేదిలేనిది తెలియనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత ఇన్నింగ్స్లో.. ఆసీస్ పేసర్ కౌల్టర్నైల్ వేసిన బంతి గబ్బర్ చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడుతూ కూడా గబ్బర్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే 109 బంతుల్లో 117 పరుగులు చేసి.. భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
నొప్పి కారణంగా గబ్బర్ వేలు వాచింది. దీంతో ఆసీస్ మ్యాచ్లో అతను ఫీల్డింగ్ చేయలేదు. గబ్బర్ స్థానంలో మ్యాచ్ మొత్తం రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. అయితే ముందు జాగ్రత్తగా గబ్బర్కు స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. స్కానింగ్ రిపోర్టులను బట్టి గురువారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో అతడిని ఆడించాలో లేదో ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్ నిర్ణయిస్తాడు. ఇప్పటికైతే గబ్బర్ వేలుకు టేప్ చుట్టి మెరుగైన చికిత్స అందిస్తున్నారట.
'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకునే సమయంలో, తాజాగా చాహాల్ టీవీలో మాట్లాడుతున్నప్పుడు కూడా గబ్బర్ చేతికి కట్టుతోనే కనిపించాడు. గబ్బర్ త్వరగా కోలుకోవాలని భారత అభిమానులు, టీం మేనేజ్మెంట్ కోరుకొంటోంది. ఒకవేళ గబ్బర్ దూరమయితే అతడి స్థానంలో రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. మరి నాలుగో స్థానంలో ఎవరు వస్తారో చూడాలి.