
ప్రపంచకప్లో టీమిండియాకు రెండో పేసర్ భువనేశ్వర్ కుమారేనని భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నారు. ప్రపంచకప్లో భాగంగా ఆదివారం లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 36 పరుగుల తేడాతో గెలిచింది. మొదటగా భారత బ్యాట్స్మన్ చెలరేగగా.. అనంతరం భువనేశ్వర్ కుమార్, జఫ్రీత్ బుమ్రాలు అద్భుత బౌలింగ్తో ఆసీస్ పని పట్టారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గొప్పగా రాణించిన భువీ, బుమ్రాలపై జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా భరత్ అరుణ్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్లో కొత్త బంతితో మొదటగా బౌలింగ్ చేసేది బుమ్రా. ఆ తర్వాత భువనేశ్వర్ అని ముందే అనుకున్నాం. ఇంగ్లాండ్ పరిస్థితులను బట్టి భువనేశ్వర్ మంచి ప్రత్యామ్నాయం. అతను బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ఇక డెత్ ఓవర్లలో కూడా అద్భుతంగా బంతులేసే సత్తా ఉంది' అని అన్నారు.
'పేసర్ మొహమ్మద్ షమీకి కూడా టోర్నీలో అవకాశాలు వస్తాయి. అయితే షమీ ఆ సమయం కోసం వేచి చూడాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బుమ్రా లాంటి బౌలర్ ఉండడం అదృష్టం. ప్రపంచంలోనే అతను అత్యుత్తమ బౌలర్. ఇన్నింగ్స్ మొదటలో, చివరలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు' అని అరుణ్ పేర్కొన్నాడు. గత మ్యాచ్లో భువీ, బుమ్రాలు ఆరు వికెట్లు తీశారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ(77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధ సెంచరీలు చేశారు.