దెబ్బ కొట్టిన నో బాల్..
క్రైస్ట్చర్చ్ వేదికగా సాగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. స్మృతి మంధాన, షెఫాలి వర్మ, మిథాలి రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా భారీ స్కోరును దక్షిణాఫ్రికా ముందుంచ గలిగింది టీమిండియా. దక్షిణాఫ్రికా కూడా ధీటుగా పోరాడింది. లారా వొల్వార్డ్ట్ 80 పరుగులు చేసింది. లారా గూడాల్, సునె లూస్, మిగ్నాన్ డుప్రీజ్.. జట్టు విజయానికి బాటలు వేశారు.
థ్రిల్లర్ను తలపించిన చివరి ఓవర్..
దక్షిణాఫ్రికా గెలవడానికి చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో దీప్తి శర్మ బంతిని అందుకుంది. తొలి బంతికి సింగిల్ లభించింది. రెండో ఓవర్లో వికెట్ పడింది. ఒత్తిడికి లోనైన దక్షిణాఫ్రికా బ్యాటర్ త్రిషా ఛెట్టి రన్ తీయడంలో తడబడింది. రనౌట్గా పెవిలియన్ చేరింది. మూడు, నాలుగు బంతులకు సింగిల్ తీశారు బ్యాటర్లు. అయిదో బంతికి గతి తప్పింది. నో బాల్ పడింది. ఫలితంగా సమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులకు చేరింది.
కన్నీళ్లు పెట్టుకున్న ప్లేయర్లు..
ఫ్రీహిట్ బాల్కు సింగిల్ లభించడంతో స్కోర్ సమం అయింది. ఆరు బంతికి డుప్రీజ్ సింగిల్ తీయడం.. టీమిండియా ప్లేయర్లు విషాదంలో మునిగిపోవడం రెండూ ఒకేసారి చోటు చేసుకున్నాయి. ఈ ఒక్క మ్యాచ్ గెలిచివుంటే సెమీ ఫైనల్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి ఉండేది విమెన్స్ టీమిండియా. నో బాల్ వల్ల ఆ ఛాన్స్ లేకుండా పోయింది. నో బాల్తో ఒక పరుగు, ఒక బంతి ఎక్స్ట్రాగా లభించడాన్ని దక్షిణాఫ్రిక బ్యాటర్లు వినియోగించుకున్నారు.
బుమ్రా నో బాల్..
గెలిచి తీరాల్సిన మ్యాచ్లో టీమిండియా నో బాల్స్ బారిన పడి ఓడిపోవడం ఇది కొత్తేమీ కాదు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఇదే సన్నివేశం కనిపించిన విషయం తెలిసిందే. భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్.. మ్యాచ్ గతినే మార్చివేసింది. ఫలితాన్ని తారుమారు చేసింది. మ్యాచ్.. టీమిండియా చేజారడానికి కారణమైంది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ 180 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
లైఫ్తో సెంచరీ..
ఫకర్ జమాన్ వ్యక్తిగత స్కోరు మూడు పరుగుల వద్ద ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతికి అవుట్ అయ్యాడు. బుమ్రా సంధించిన బంతి- జమాన్ బ్యాట్ను అలా టచ్ చేసి.. వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ చేతుల్లో వాలింది. అది నో బాల్ కావడంతో బతికి పోయిన జమాన్.. ఆ తరువాత చెలరేగిపోయాడు. 114 పరుగులు చేశాడు. ఫలితంగా పాకిస్తాన్ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచగలిగింది. ఆ తరువాత ఛేజింగ్కు దిగిన టీమిండియా 158 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా వేసిన బంతి నో బాల్ కాకపోయి ఉంటే.. జమాన్- మూడు పరుగుల వద్దే వెనుతిరిగి ఉండేవాడు.


Click it and Unblock the Notifications












