SriLanka cricket board: ఐసీసీ ప్రపంచకప్ 2023లో దారుణ పరిజయాలను చవి చూస్తోంది శ్రీలంక. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జట్టు ఇది. పసికూన హోదా నుంచి మేటిజట్టుగా ఎదిగింది. ఐసీసీ ప్రపంచకప్ను సొంతం చేసుకోగలిగింది. భారత్, ఆస్ట్రేలియా వంటి కొమ్ములు తిరిగిన జట్లు సైతం శ్రీలంకతో తలపడటానికి వెనుకాముందు ఆడేవి.
1996లో ప్రపంచ కప్ను గెలిచింది శ్రీలంక. పటిష్టమైన ఆస్ట్రేలియాను చిత్తు చేసిందప్పటి ఫైనల్స్లో. 2011లో వరల్డ్ కప్లో ఫైనలిస్ట్ కూడా. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, రోషన్ మహానామా, కుమార సంగక్కార, జయవర్దనె, దిల్షాన్, చమిందా వాస్.. వంటి ఎంతోమంది ప్లేయర్లు శ్రీలంకను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారు.

అలాంటి జట్టు ఇప్పుడు దయనీయంగా మారింది. కుమార సంగక్కార, జయవర్దనె ఉన్నన్ని రోజులూ శతృదుర్భేధ్యంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత పతనమైంది. చిన్న జట్లపై సైతం పరాజయాన్ని చవి చూస్తోంది. ఈ వరల్డ్ కప్లో శ్రీలంక ఎంత ఘోరంగా ఆడుతున్నదో తెలిసిన విషయమే. టీమిండియాపై కనీసం 100 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసింది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. క్రికెట్ బోర్డులో ప్రక్షాళణకు పూనుకుంది. బోర్డును సస్పెండ్ చేసింది. దీని స్థానంలో ఓ మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసింది. జట్టు ప్లేయర్ల ఎంపిక మొదలుకుని, ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, దేశవాళీ టోర్నమెంట్ల నిర్వహణ వరకు మరమ్మతు చేసేలా నిర్ణయం తీసుకుంది.
ఈ కమిటీకి అర్జున రణతుంగను ఛైర్మన్గా నియమించింది. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, ఎస్ ఐ ఇమామ్, రోహిణి మరసింఘె, ఇనంగణి పెరీరా, ఉపాలి ధర్మసేన, రకిత రాజపక్సె, హిషన్ జమాల్దీన్ను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ ప్రస్తుతానికి బోర్డు కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ మేరకు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింఘె ఉత్తర్వులు జారీ చేశారు.