Pakistan semifinals scenario: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ రసవత్తర స్థాయికి చేరుకుంది. 80 శాతం టోర్నమెంట్ ముగిసినట్టే. న్యూజిలాండ్, పాకిస్తాన్ ఎనిమిది, మిగిలిన జట్లు ఏడేసి చొప్పున మ్యాచ్లు ఆడాయి. ఏ జట్లు సెమీ ఫైనల్స్ చేరుకుంటాయనేది పూర్తిగా ఖరారు కావాట్లేదు.
సెమీ ఫైనల్స్లో రెండు బెర్తులు మాత్రమే ఫుల్ అయ్యాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. వరుసగా ఏడు విజయాలతో టీమిండియా నేరుగా సెమీలో అడుగుపెట్టింది. పాకిస్తాన్ చేతిలో న్యూజిలాండ్ పరాజయం పాలవడం వల్ల దక్షిణాఫ్రికా లబ్ది పొందింది. గ్రూప్స్లో భారత్తో జరిగే నేటి మ్యాచ్లో జయాపజయాలతో సంబంధం లేకుండా సెమీస్లో ఎంట్రీ ఇచ్చింది.

న్యూజిలాండ్తో బెంగళూరులో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించడం.. ఆ జట్టు సెమీస్ అవకాశాలు మరింత సులభతరం చేసింది. ఈ రేసులోకి ఆ జట్టు దూసుకొచ్చింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచిందా జట్టు. టాప్ 4లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు సవాల్ విసురుతోంది.
తన తదుపరి మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టాల్సి బాబర్ ఆజమ్ సేనకు. సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది పాకిస్తాన్కు. అదొక్కటే సరిపోదు. నాలుగు మిగిలిన జట్ల గెలుపోటములు కూడా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయగలుగుతాయి.
గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్ రెండు కఠిన మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఒకటి ఆస్ట్రేలియాతో ఈ నెల 7వ తేదీన, మరొకటి దక్షిణాఫ్రికాతో 10వ తేదీన. ఈ రెండింట్లోనూ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే పాకిస్తాన్కు అడ్డంకి తొలగినట్టవుతుంది. ఎందుకంటే- ప్రస్తుతం ఆఫ్ఘన్ కూడా ఎనిమిది పాయింట్లతో పాకిస్తాన్తో సమానంగా నిలిచింది కాబట్టి.
ఎనిమిది పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్.. తన చివరి గ్రూప్ మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓడిపోవాలి. అప్పుడు ఎనిమిది పాయింట్ల వద్దే ఆ జట్టు ప్రస్థానం నిలిచిపోతుంది. న్యూజిలాండ్.. శ్రీలంకపై 50 పరుగుల తేడాతో గెలిస్తే పాకిస్తాన్ ఆ రన్రేట్ను అందుకోవడానికి కనీసం 180 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించాల్సి ఉంటుంది.
న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతో గెలిస్తే పాకిస్తాన్ 131 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించాలి. ఇవన్నీ జరిగితే పాకిస్తాన్.. సెమీ ఫైనల్స్లో అడుగుపెట్టగలుగుతుంది. ప్రస్తుతం వరుసగా నాలుగు పరాజయాలతో దెబ్బతిన్న పులిలా ఉన్న న్యూజిలాండ్... శ్రీలంకను అంత తేలిగ్గా వదిలిపెట్టకపోవచ్చు.