PAK vs SA: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆసక్తికరమైన మ్యాచ్ కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న దక్షిణాఫ్రికాతో ఢీకొడుతోంది పాకిస్తాన్. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకూ కీలకమైన గేమ్ ఇది.
పాకిస్తాన్కు డు ఆర్ డై మ్యాచ్ ఇది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరడానికి కొద్దో, గొప్పో అవకాశాలు ఉంటాయి. ఓడిందంటే మాత్రం పెట్టే బేడా సర్దుకోక తప్పదు. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్లల్లో బాబర్ ఆజమ్ సేన గెలిచింది రెండింట్లోనే. వరుసగా మూడు మ్యాచ్లల్లో పరాజయాన్ని చవి చూసింది. హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్.. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. అబ్దుల్లా షఫిక్- 9, ఇమామ్-ఉల్ హక్- 12 పరుగులు చేసి మార్కో జన్సెన్ బౌలింగ్లో వెనుదిరిగారు. ప్రస్తుతం కేప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఆడుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ జట్టు స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు.
సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా బౌలర్లను రెచ్చగొడుతోంది. వారితో స్లెడ్జింగ్కు దిగుతోంది. ఫలితంగా- బౌలర్ల రిథమ్, ఏకాగ్రతను దెబ్బతీయాలనేది పాకిస్తాన్ గేమ్ ప్లాన్. గతి తప్పి బంతులను సంధిస్తే- వాటిని బౌండరీలు మలచాలనేది పాకిస్తాన్ వ్యూహం కావొచ్చు.
దీనికి నిదర్శనమా? అన్నట్లు- మార్కో జన్సెన్తో వాగ్వివాదానికి దిగాడు మహ్మద్ రిజ్వాన్. పాకిస్తాన్ ఓపెనర్లను పెవిలియన్ దారి పట్టించిన బౌలర్ అతను. నిప్పు కణికల్లాంటి బంతులను సంధిస్తోన్న జన్సెన్తో అకారణంగా వాగ్వివాదానికి దిగాడు రిజ్వాన్. అతని రిథమ్ను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.
తన తొలి అయిదు ఓవర్లల్లో 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు జన్సెన్. ఇందులో ఒకటి మెయిడెన్ కూడా. అందుకే- అతన్ని టార్గెట్ చేశాడు రిజ్వాన్. వాగ్వివాదానికి దిగాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య వాడివేడిగా వాగ్వివాదం కొనసాగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ జోక్యం చేసుకోవడంతో రిజ్వాన్ వెనుదిరిగాడు.