Aiden Markram: ఐసీసీ ప్రపంచ కప్ 2024లో దక్షిణాఫ్రికా దూకుడు కంటిన్యూ అవుతోంది. తన ప్రత్యర్థిని చిత్తు చేయడంలో చెలరేగుతోంది. భారీ తేడాతో మట్టకరిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్లల్లో నాలుగింట్లో తిరుగులేని విజయాన్ని సాధించిందా జట్టు. నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయినా.. వేగంగా బౌన్స్ బ్యాక్ అయింది.
ముంబైలోని వాంఖెడే స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది దక్షిణాఫ్రికా. తొలుత బ్యాటింగ్కు దిగిన ప్రొటీస్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ ఎప్పట్లాగే చెలరేగాడు. 140 బంతుల్లో ఏడు సిక్సర్లు, 15 బౌండరీలతో 174 పరుగులు చేశాడు.

కేప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తన ఫామ్ను కొనసాగిస్తోన్నాడు. 69 బంతుల్లో ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్ ఆడాడు. 49 బంతుల్లోనే ఎనిమిది భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 90 పరుగులతో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఆ తరువాత బౌలింగ్లోనూ సత్తా చాటింది దక్షిణాఫ్రికా. ప్రత్యర్థి జట్టును 233 పరుగులకే కట్టడి చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మహ్మదుల్లా సెంచరీ మినహా ఆ జట్టు ఇన్నింగ్లో చెప్పుకోవడానికి పెద్దగా ఎలాంటి మెరుపుల్లేవు. 111 పరుగులతో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలకుండా నిలబెట్టగలిగాడు మహ్మదుల్లా.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది దక్షిణాఫ్రికా. అయిదింట్లో ఒక ఓటమితో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. అయినప్పటికీ- నెట్ రన్రేట్ ఆ జట్టుదే ఎక్కువ. ప్లస్ 2లో ఉందా జట్టు. ఈ స్థాయి నెట్ రన్రేట్.. అగ్రస్తానంలో ఉన్న భారత్కూ లేదు.
దక్షిణాఫ్రికా ఈ స్థాయిలో చెలరేగడానికి గల కారణాలను వెల్లడించాడు స్టాండ్బై కేప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్. ఐపీఎల్ ఆడిన అనుభవం తమకు బాగా కలిసొచ్చిందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండటం వల్ల ఇక్కడి పిచ్లు, వాతావరణానికి అలవాటు పడ్డామని వివరించాడు.
ఐపీఎల్లో టీ20 ఫార్మట్లో భారత పిచ్లపై దూకుడుగా ఆడామని గుర్తు చేశాడు. ఎలాంటి బౌలర్ను అయినా ఎదుర్కోవడానికి అవసరమైన ప్లానింగ్ రూపొందించుకోగలిగామని అన్నాడు. వరల్డ్ కప్ సన్నాహకాలకు ఆ అనుభవం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. ఎయిడెన్ మార్క్రమ్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్గా వ్యవహరిస్తోన్నాడు. క్లాసెన్ కూడా ఆ జట్టు ప్లేయరే.