Jai Shree Hanuman: ఐసీసీ ప్రపంచకప్ 2023లో దక్షిణాఫ్రికా దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లల్లో ఆరింట్లో నెగ్గింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా దూకుడు ధాటికి భారత్ సైతం తన స్థానాన్ని కోల్పోక తప్పలేదు. ప్రొటీస్ ఖాతాలో ఒక ఓటమి ఉన్నప్పటికీ.. నెట్ రన్రేట్ టీమిండియా కంటే ఎక్కువే.
ఈ ప్రపంచ కప్లో పాకిస్తాన్ కథ దాదాపుగా ముగిసినట్టే. దక్షిణాఫ్రికాపై ఓటమితో ఆ జట్టు సెమీ ఫైనల్స్ ఆశలు అడుగంటాయి. ఇంకా ఆ జట్టు చేతిలో మూడు మ్యాచ్లు మిగిలే ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జట్టు గెలవడం అసాధ్యమే కావొచ్చు. తన తదుపరి మ్యాచ్లల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో ఢీ కొట్టాల్సి ఉంది. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మూడింట్లోనూ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

డు ఆర్ డై మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో మట్టికరిచింది పాకిస్తాన్. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరడానికి కొద్దో, గొప్పో అవకాశాలు ఉండేవి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్.. 46.4 ఓవర్లల్లో 270 పరుగులకు ఆలౌట్ అయింది. కేప్టెన్ బాబర్ ఆజమ్- 50, సవూద్ షకీల్- 52, షాదబ్ ఖాన్- 43 పరుగులతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా.. ఒక వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది. 47.2 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 260 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన తరువాత మ్యాచ్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపినప్పటికీ- లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షాంసీ.. జాగ్రత్తగా ఆడారు. మరో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు.
విన్నింగ్ షాట్ ఆడాడు కేశవ్ మహరాజ్. బౌండరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. పూర్తిగా బౌలింగ్కే పరిమితమైన కేశవ్ .. 21 బంతులను ఎదుర్కొనగలిగాడు. వికెట్ పడకుండా కాపాడుకోగలిగాడు. 48వ ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించి జట్టును గెలిపించాడు. ఏడు పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

ఈ విజయం అనంతరం తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. జై శ్రీ హనుమాన్ పోస్ట్ చేశాడు. భగవంతుడిపై భారం వేసి ఆడానని చెప్పుకొచ్చాడు. దేవుడిని నమ్ముతానని, అది వమ్ము కాలేదని పేర్కొన్నాడు. తనతో పాటు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో నాటౌట్గా నిలిచిన తబ్రేజ్ షాంసీ, టాప్ స్కోరర్ ఎయిడెన్ మార్క్రమ్ను ప్రశంసించాడు. జై శ్రీ హనుమాన్ అంటూ తన పోస్ట్ను ముగించాడు.
ఇదివరకు ఓ మ్యాచ్లో కేశవ్ మహరాజ్ బ్యాట్పై ఓం అనే స్టిక్కర్ దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. అతను క్రీజ్లో ఉన్నప్పుడు ఈ స్టిక్కర్లో అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా పదే పదే ఆకాశం వైపు చూస్తూ భగవంతుడిని ప్రార్థించడం కనిపించింది.
కేశవ్ మహరాజ్ పూర్తి పేరు కేశవ్ ఆత్మానంద్ మహరాజ్. అతని పూర్వీకులు భారతీయులే. దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. 1990 ఫిబ్రవరి 7వ తేదీన డర్బన్లోని నాటల్లో జన్మించాడు కేశవ్. అతని కుటుంబం హిందూమతాన్ని అనుసరిస్తోంది. అందుకే- తన మూలాలను మర్చిపోలేదు కేశవ్.