కోల్కత: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. నేడు రెండు మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. ఈ ఉదయం 10:30 గంటలకు ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న మరో మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఢీకొడుతోంది పాకిస్తాన్. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లకూ ఇదే చివరి మ్యాచ్లు. ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే సెమీ ఫైనల్స్కు చేరింది. మిగిలిన మూడూ ఇంటిదారి పట్టక తప్పదు. బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా ఓడినా పెద్దగా తేడా ఉండదు.

ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆ జట్టు కేప్టెన్ జోస్ బట్లర్. దీనితో పాకిస్తాన్ కథ ముగిసినట్టయింది. తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ రేసు నుంచి వైదొలగినట్టే అవుతుంది. ఎందుకంటే- ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదించడం దుస్సాధ్యం కాబట్టి.
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 50 పరుగులు చేస్తే- దాన్ని రెండు ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది పాకిస్తాన్కు. 100 చేస్తే- 2.5 ఓవర్లు, 200 చేస్తే- 4.3 ఓవర్లు, 300 పరుగులు చేస్తే- 6.1 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని కొట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యం. సో- దీన్ని బట్టి చూస్తే- పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి వైదొలగినట్టే అయింది.
కాగా పాకిస్తాన్ తుదిజట్టులో - అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సవూద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, అఘా సల్మాన్, మహ్మద్ వసీం జూనియర్, షహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్ ఆడుతున్నారు.
ఇంగ్లాండ్ తుది జట్టులో- జానీ బెయిర్స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్ వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్ చోటు దక్కించుకున్నారు.