Wasim Akram: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. న్యూజిలాండ్, శ్రీలంక మినహా అన్ని జట్లూ ఒకటి చొప్పున మ్యాచ్ను ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఈ నెల 12వ తేదీన భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ వరల్డ్ కప్లో అదే చిట్టచివరిది. దీని తరువాత సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్.

గ్రూప్ దశలో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. బెంగళూరులో శ్రీలంకను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లల్లో 171 పరుగులకు ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 23.2 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి ఛేదించారు బ్లాక్ క్యాప్స్.
ఈ విజయంతో తన సెమీ ఫైనల్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సెమీస్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సరసన చేరినట్టయింది. ఇంగ్లాండ్పై జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి తీరుపై ఇది ఆధారపడి ఉంది. భారీ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించగలిగితేనే పాకిస్తాన్కు సెమీ ఫైనల్స్ అవకాశాలు ఉంటాయి.
తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్కు దిగితే 300 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇంగ్లాండ్ను 13 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్కు దిగి 300 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆరు ఓవర్లలోనే కొట్టాల్సి ఉంటుంది. అలా జరిగితేనే పాకిస్తాన్ నెట్ రన్రేట్ మెరుగు పడుతుంది.
అది సాధ్యం అయ్యే పని కాదు. దీన్ని బట్టి చూస్తే- న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ స్థానం ఖరారైనట్టే. దీనిపై పాకిస్తాన్ మాజీ కేప్టెన్, లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ మండిపడ్డాడు. తన దేశ జాతీయ జట్టు ఆడుతున్న వైఖరిపై నిప్పులు చెరిగాడు. ఇలాంటి జట్టును తాను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. జట్టు తనను తాను మళ్లీ తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
పనిలో పనిగా- బాబర్ ఆజమ్ సేనపై సెటైర్లనూ సంధించాడు వసీం అక్రమ్. న్యూజిలాండ్ను దాటుకుని సెమీ ఫైనల్స్ చేరడానికి, తన నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకోవడానికి ఉచిత సలహా ఇచ్చాడు. ఇంగ్లాండ్ జట్టు మొత్తాన్నీ ఒకేసారి టైమ్ అవుట్ చేయగలిగితేనే పాకిస్తాన్ సెమీస్ చేరుతుందని వ్యాఖ్యానించాడు.
ఇంగ్లాండ్ను సామూహికంగా టైమ్ అవుట్ చేయడానికి చిట్కా చెప్పాడు వసీం అక్రమ్. తొలుత బ్యాటింగ్ చేయాలని, అనంతరం ఇంగ్లాండ్ టీమ్ ప్లేయర్లందరినీ వాళ్ల డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి తాళం వేయాలని చురకలు అంటించాడు. అది జరిగితేనే పాకిస్తాన్ సెమీస్ వెళ్లగలుగుతుందని ఎద్దేవా చేశాడు.