బెంగళూరు: ఐసీసీ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా కొనసాగుతోంది. టోర్నమెంట్ గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మినహా అన్ని జట్లు కూడా ఏడేసి చొప్పున మ్యాచ్లను ఆడాయి. ఆయా జట్ల చేతిలో మిగిలివున్నవి ఇంక రెండు చొప్పున మ్యాచ్లే.
అయినప్పటికీ.. ఏ జట్టు సెమీ ఫైనల్స్కు చేరే జట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు రోహిత్ సేన ఒక్కటే సెమీ ఫైనల్స్లో అడుగు పెట్టింది. సెమీ ఫైనల్స్లో టీమిండియాను ఢీ కొట్టగలిగే ప్రత్యర్థులెవరనే విషయంపై ఇంకా స్పష్టత రావట్లేదు. నెదర్లాండ్స్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించిన తరువాత- ఇది మరింత క్లిష్టమైంది.

ఈ సస్పెన్స్కు తెర దించబోతోంది నేటి మ్యాచ్. పాకిస్తాన్తో న్యూజిలాండ్ తలపడబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది కీలకమైనదే.. న్యూజిలాండ్కు మరింత. గెలిచి తీరాల్సిన గేమ్ ఇది.
టోర్నమెంట్ ఆరంభంలో వరుస విజయాలను సాధిస్తూ ఆ తరువాత చతికిలపడ్డ బ్లాక్ క్యాప్స్.. తమ సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకోవాలంటే ఇదొక్కటీ గెలిస్తే చాలు. న్యూజిలాండ్ గెలిస్తే గనక మొత్తం నాలుగు జట్లు వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ నుంచి వైదొలగుతాయి. ఇంటిదారి పడతాయి.
న్యూజిలాండ్ గెలుపు.. నాలుగు జట్ల సెమీ ఫైనల్స్ అవకాశాలను దెబ్బతీస్తుంది. పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ రేసు నుంచి తప్పుకొనేలా చేస్తుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే టోర్నమెంట్లో కొనసాగుతాయి.
పాకిస్తాన్ గెలిస్తే మాత్రం సెమీ ఫైనల్స్పై స్పష్టత ఇప్పటికిప్పుడు రానట్టే అవుతుంది. భారీ రన్రేట్ తేడాతో న్యూజిలాండ్ను బాబర్ ఆజమ్ సేన ఓడించగలిగితే సెమీస్లో చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంటుంది. న్యూజిలాండ్కు జీవన్మరణ సమస్యగా మారుతుంది. తమ తదుపరి మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.