బెంగళూరు: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్లో లెఫ్ట్ హ్యాండర్ల హవా నడుస్తోంది. సెంచరీల మీద సెంచరీలు ఊది అవతల పడేస్తోన్నారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు. ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా 10 సెంచరీలు వారి పేర్ల మీద నమోదయ్యాయి. ఇంకా గ్రూప్ మ్యాచ్లు, సెమీ ఫైనల్స్, ఫైనల్ మిగిలివుండగానే ఇన్ని సెంచరీలు చేశారంటే మాటలు కాదు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ లెఫ్ట్ హ్యాండర్ రచిన్ రవీంద్ర మరోసారి సెంచరీ చేశాడు. ఈ టోర్నమెంట్లో ఇది అతని ముడో సెంచరీ. ఇదివరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్పై సెంచరీ అందుకున్నాడు. ఇది అతని మొట్టమొదటిది.

దాని తరువాత ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ నిర్దేశించిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 89 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో అయిదు పరుగుల తేడాతో మాత్రమే ఓడింది న్యూజిలాండ్.
ఇప్పుడు తాజాగా బెంగళూరులో పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ముచ్చటగా మూడోసారి సెంచరీ చేశాడు. 108 పరుగులకు అవుట్ అయ్యాడు. రచిన సెంచరీ దెబ్బకు న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ ఎక్కడికో వెళ్లింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 401 పరుగులు చేసింది. పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

రచిన్ రవీంద్ర ఒక్కడే కాదు.. దక్షిణాఫ్రికా ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సైతం సెంచరీలతో కదం తొక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు సెంచరీలు చేశాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఆస్ట్రేలియాకు చెందిన డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం రెండు సెంచరీలు సాధించాడు. అతనూ లెఫ్ట్ హ్యాండరే.

న్యూజిలాండ్కే చెందిన ఓపెనర్ డెవాన్ కాన్వే, ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ కూడా తమ ప్రత్యర్థులపై సెంచరీలతో చేలరేగిన మ్యాచ్లు ఈ వరల్డ్ కప్లో ఉన్నాయి. ఇంగ్లాండ్పై డెవాన్ కాన్వే, బంగ్లాదేశ్పై డేవిడ్ మలన్ వంద పరుగుల మైలురాయిని అందుకున్నారు. వారిద్దరూ కూడా లెఫ్ట్ హ్యాండర్లు కమ్ ఓపెనర్లే.