ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
తన తదుపరి మ్యాచ్ను నవంబర్ 2వ తేదీన ఆడబోతోంది టీమిండియా. శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. ముంబైలోని వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. శ్రీలంకపైనా టీమిండియా ఇదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్ కోసం రెండు జట్లూ ఇప్పటికే ముంబై చేరుకున్నాయి. వాంఖెడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్లో గడుపుతున్నాయి. శ్రీలంకపై గెలవడం వల్ల తన సెమీ ఫైనల్స్ బెర్త్ను ఖాయం చేసుకోవాలనే పట్టుదల టీమిండియాలో కనిపిస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ.. ఈ దిశగా జట్టును సమాయాత్తం చేస్తోన్నారు.
శ్రీలంకతో మ్యాచ్ను మినహాయిస్తే లీగ్ దశలో ఇంకో రెండు మాత్రమే భారత్ చేతిలో ఉంటాయి. ఈ నెల 5వ తేదీన ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో ఒకటి. బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్తో మరో గేమ్ మిగిలివుంటాయి. ఈ రెండింటి గెలుపోటములతో సంబంధం లేకుండా శ్రీలంకపై గెలిచి దర్జాగా సెమీ ఫైనల్స్లో అడుగు పెట్టాలని భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో- మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డే అవుట్కు వెళ్లాడు. ఎవరూ గుర్తు పట్టకుండా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ఓ జర్నలిస్ట్/కెమెరామెన్ అవతారం ఎత్తాడు. నెత్తిన టోపీ, కళ్లకు గ్లాసెస్, ముఖానికి మాస్క్ ధరించాడు. తన చేతుల నిండా ఉన్న టాటూను గుర్తు పట్టకుండా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నాడు.
చేతిలో కెమెరా పట్టుకుని ముంబైలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ మెరైన్ డ్రైవ్కు వెళ్లాడు. క్రికెట్ లవర్స్తో చిట్ చాట్ చేశాడు. వారి అభిప్రాయాలను సేకరించాడు. తన గురించి తానూ అడిగి తెలుసుకున్నాడు. ఈ వీడియోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ట్విస్ట్ ఏమిటంటే- రవీంద్ర జడేజా సైతం అతన్ని గుర్తు పట్టలేకపోయాడు.