ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది రోహిత్ సేన. 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ మరోసారి కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 87 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్-49, కేఎల్ రాహుల్- 39 పరుగులు చేశారు.

బ్యాటింగ్లో తడబడినప్పటికీ.. టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా రాణించింది. బలమైన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచింది. 129 పరుగులకే కుప్పకూల్చింది. మహ్మద్ షమీ- 4, జస్ప్రీత్ బుమ్రా- 3 వికెట్లతో నిప్పులు చెరిగారు. కుల్దీప్ యాదవ్-2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
తన తదుపరి మ్యాచ్ను నవంబర్ 2వ తేదీన ఆడబోతోంది టీమిండియా. శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. ముంబైలోని వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. శ్రీలంకపైనా టీమిండియా ఇదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియాకు మరో గుడ్ న్యూస్ అందింది. గాయపడ్డ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో జట్టులోకి రానున్నాడు. సెమీ ఫైనల్స్ నాటికి అందుబాటులోకి వచ్చేస్తాడు. లీగ్ దశలో ఏ మ్యాచ్లకూ అతను అందుబాటులో ఉండనట్టే. లీగ్ దశలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్లతో భారత్.. ఆడాల్సి ఉంది.
ఈ మూడు మ్యాచ్లకూ హార్దిక్ పాండ్యా దూరంగానే ఉండబోతోన్నాడు. సెమీ ఫైనల్స్ నాటికి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్లో ఉంటోన్నాడు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటోన్నాడు.
నవంబర్ 5వ తేదీన కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ నాటికి హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయి ఫిట్నెస్ను సాధించడం ఖాయమే అయినప్పటికీ.. విశ్రాంతి అవసరమౌతుందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. ఈ టోర్నమెంట్లో చిట్టచివరి లీగ్ భారత్- నెదర్లాండ్స్ మ్యాచ్. సెమీ ఫైనల్స్ కోసం వామప్స్గా హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్లో ఆడొచ్చనీ తెలిపాయి.