Virat Kohli: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది టీమిండియా. వరుసగా ఎనిమిది విజయాలను సాధించింది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయినప్పటికీ తన వేగాన్ని తగ్గించట్లేదు. ఎదురొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్తోంది. ఫైనల్స్పై ఆశలు రేకెత్తించింది.
కోల్కత ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాను ఉతికారేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో చెలరేగాడు. 121 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇది అతని 49వ సెంచరీ. శ్రేయాస్ అయ్యర్-77, రోహిత్ శర్మ- 40 చేశారు. చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో 326 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది టీమిండియా.

అనంతరం బౌలర్లు తమ తడాఖా చూపారు. బలమైన దక్షిణాఫ్రికా బ్యాటర్లను చీల్చి చెండాడారు. 83 పరుగులకే బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. ఆల్ రౌండర్ మార్కో జెన్సెన్ చేసిన 14 పరుగులే దక్షిణాఫ్రికా ఇన్నింగ్లో టాప్ స్కోర్ అంటే బౌలర్ల దాడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రవీంద్ర జడేజా అయిదు వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు.
తన తదుపరి మ్యాచ్ను నెదర్లాండ్స్తో ఆడబోతోంది భారత్. ఈ వరల్డ్ కప్ 2023లో ఇదే చిట్టచివరి గ్రూప్ మ్యాచ్. ఈ నెల 12వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో షెడ్యూల్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్గా విరాట్ కోహ్లీకి ఇది హోమ్ గ్రౌండ్. అందుకే- ఇది కూడా గెలుస్తుందని, గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టుగా రికార్డు సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్లో టెండుల్కర్ 49 సెంచరీలు చేయగా.. దీన్ని బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అతని దూకుడు చూస్తోంటే ఈ వరల్డ్ కప్లోనే తన 50వ సెంచరీని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సురేష్ రైనా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్పై బెంగళూరులో జరిగే మ్యాచ్లో కోహ్లీ తన 50వ సెంచరీని అందుకోవాలని ఆకాంక్షించాడు. సెమీ ఫైనల్స్లో 51వది, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో 52వ సెంచరీ చేయాలనీ తాను కోరుకుంటున్నట్లు వివరించాడు.