Virat Kohli birthday: ఐసీసీ ప్రపంచకప్ 2023.. టీమిండియా విజృంభణకు అద్దం పడుతోంది. సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటివరకు ఓటమి అంటే తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది భారతే. సగం టోర్నమెంట్ అయినపోయినప్పటికీ టీమిండియాను కొట్టే జట్టే లేదు.
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవీ టీమిండియా ముందు నిలవలేకపోయాయి. చివరికి న్యూజిలాండ్ సైతం భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. అయిదు విజయాలు- 10 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టు ఇదే అవుతుంది.

ప్రతి మ్యాచ్లోనూ కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. తమ ప్రతాపం చూపుతోన్నారు. ఈ ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఆడిన చివరి అయిదు మ్యాచ్లల్లో వరుసగా.. 85, 55 (నాటౌట్), 16, 103 (నాటౌట్), 95 పరుగులు చేశాడు కోహ్లీ. అతని దూకుడు ఇక్కడితో ఆగదనేది స్పష్టమౌతోంది.
న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో 95 పరుగుల వద్ద అవుట్ కావడం అభిమానులను నిరాశ పరిచింది. వన్డేల్లో ఇప్పటివరకు 48 సెంచరీలు అందుకున్నాడీ రన్ మెషీన్. సెంచరీల హాఫ్ సెంచరీ అందుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయ్యేలోగా ఈ కొరత కూడా తీరుతుందనే అంచనాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి.
నవంబర్ 5వ తేదీన విరాట్ కోహ్లీ బర్త్డే. అదే రోజున టీమిండియా కోల్కత ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లూ అదరగొడుతున్నాయి ఈ టోర్నమెంట్లో. దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియాతో సమానంగా ఆ జట్టుకు కూడా 10 పాయింట్లు ఉన్నప్పటికీ- నెట్ రన్రేట్ దక్షిణాఫ్రికాకే అధికంగా ఉంది.
విరాట్ కోహ్లీ బర్త్డే, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రెండూ కలిసి వచ్చిన నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కాస్త గట్టిగానే సెలబ్రేషన్స్ను ప్లాన్ చేసింది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ భారీ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ను నిర్వహించాలని భావిస్తోంది. కోహ్లీ అంటే బెంగాలీయులు ఎంతగానో అభిమానిస్తారని, అందుకే దీన్ని ప్లాన్ చేశామని క్యాబ్ తెలిపింది.