IND vs SA: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా.. నేడు మరో మ్యాచ్ ఆడబోతోంది. వరుసగా ఏడు విజయాలతో ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో షెడ్యూల్ అయిందీ గేమ్.
ఇప్పటికే రెండు జట్లూ కోల్కతకు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్లో చెమటోడుస్తోన్నాయి. అటు దక్షిణాఫ్రికా సైతం ఊపు మీద ఉంది. ఓ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో ఆరింట్లో గెలిచింది. అవన్నీ హై-స్కోర్ మ్యాచ్లే. ఓపెనర్ క్వింటన్ డికాక్ సహా వాన్ డెర్ డస్సెన్, బ్యాటర్లు ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్.. ఇలా జట్టు మొత్తం ఫుల్ ఫామ్లో ఉంది.

భారత్ తరువాత సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టు దక్షిణాఫ్రికే. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను పాకిస్తాన్ ఓడించడంతో దక్షిణాఫ్రికా లబ్ది పొందింది. మిగిలిన మ్యాచ్లల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ జట్టు సెమీ ఫైనల్స్లో అడుగు పెట్టింది. ఇంకో రెండు బెర్త్లో మిగిలివున్నాయి. ఓ బెర్త్ ఆస్ట్రేలియాకు దాదాపుగా ఖాయమైనట్టే.
ఈ పరిస్థితుల్లో కోల్కత పోలీసులు సంచలనం సృష్టించారు. కీలక ఆదేశాలను జారీ చేశారు. నోటీసులను ఇష్యూ చేశారు. టికెట్ల అమ్మకాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమకు అందజేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు.
ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఛైర్మన్ రోజర్ బిన్నీకి నోటీసులను పంపించారు. ఈ విషయాన్ని కోల్కత పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. టికెట్ల అమ్మకాల సమాచారం, డాక్యుమెంట్లను తాము కోరామని అన్నారు. వాటిని మైదాన్ పోలీస్ స్టేషన్లో సమర్పించాలని సూచించినట్లు తెలిపారు.
బీసీసీఐ లేదా ఆధీకృత ఏజెంట్లు/ఏజెన్సీ లేదా ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా జరిపిన టికెట్ల అమ్మకాల పూర్తి సమాచారాన్ని తాము కోరామని తెలిపారు. శనివారం సాయంత్రం ఈ నోటీసులను బీసీసీఐ ఛైర్మన్కు పంపించినట్లు వివరించారు. బీసీసీఐ నుంచి ఇంకా వివరాలు లేదా వివరణ అందాల్సి ఉందని చెప్పారు.