కోల్కత: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారత జట్టుకు బిగ్ షాక్. గాయం బారిన పడ్డ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. గాయం నుంచి కోలుకోలేకపోవడం వల్ల అతను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది.
దీని తరువాత జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైస్ కేప్టెన్గా వ్యవహరిస్తోన్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు ఉప సారథి పగ్గాలను అప్పగించింది.

ఈ విషయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ధృవీకరించారు. వైస్ కేప్టెన్ హోదాలో కేఎల్ రాహుల్.. జట్టు ఓరియంటేషన్స్ హాజరవుతున్నాడని తెలిపారు. బౌలర్లు, బ్యాటర్లకు ప్రత్యేకంగా ఓరియంటేషన్ సెషన్ తీసుకుంటోంది టీమ్ మేనేజ్మెంట్. దీనికి వైస్ కేప్టెన్ హోదాలో అతను పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు.
వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు జట్టు సాధించిన విజయాల్లో కేఎల్ రాహుల్ కీలకంగా మారాడని, వికెట్ల వెనక మెరుపులా కదులుతున్నాడని ద్రావిడ్ కితాబిచ్చాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడని, గురి తప్పని జడ్జ్మెంట్ ఇచ్చాడని పేర్కొన్నాడు.

కేప్టెన్ రోహిత్ శర్మ- వైస్ కేప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా ఈ వరల్డ్ కప్లో ఇక మిగిలిన మ్యాచ్లను ఆడబోతోంది. తన తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ నెల 5వ తేదీన కోల్కతని ఈడెన్ గార్డెన్స్లో షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది.మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది.
దీని తరువాత 12వ తేదీన బెంగళూరులో నెదర్లాండ్స్తో తలపడుతుంది. అదే చివరిది. సెమీ ఫైనల్స్ బెర్త్ ఎలాగూ ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్ కూడా రోహిత్- రాహుల్ జోడీ సారథ్యంలో ఎదుర్కొంటుంది భారత్. వీరిద్దరూ జట్టును ఫైనల్స్కు ఎంత వరకు తీసుకెళ్లగలుగుతారనేది ఆసక్తి రేపుతోంది.