కోల్కత: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా.. నేడు మరో మ్యాచ్ ఆడబోతోంది. వరుసగా ఏడు విజయాలతో ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో షెడ్యూల్ అయిందీ గేమ్.
ఇప్పటికే రెండు జట్లూ కోల్కతకు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్లో చెమటోడుస్తోన్నాయి. అటు దక్షిణాఫ్రికా సైతం ఊపు మీద ఉంది. ఓ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో ఆరింట్లో గెలిచింది. అవన్నీ హై-స్కోర్ మ్యాచ్లే. ఓపెనర్ క్వింటన్ డికాక్ సహా వాన్ డెర్ డస్సెన్, బ్యాటర్లు ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్.. ఇలా జట్టు మొత్తం ఫుల్ ఫామ్లో ఉంది.

భారత్ తరువాత సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టు దక్షిణాఫ్రికే. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ను పాకిస్తాన్ ఓడించడంతో దక్షిణాఫ్రికా లబ్ది పొందింది. మిగిలిన మ్యాచ్లల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ జట్టు సెమీ ఫైనల్స్లో అడుగు పెట్టింది. ఇంకో రెండు బెర్త్లో మిగిలివున్నాయి. ఓ బెర్త్ ఆస్ట్రేలియాకు దాదాపుగా ఖాయమైనట్టే.
అటు విరాట్ కోహ్లీ బర్త్డే కూడా కలిసి రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు ఉండట్లేదు. ఫ్యాన్స్లో జోష్ పెరిగింది. కోల్కతలో పెద్ద ఎత్తున వేడుకలు షురూ చేశారు. భారీ కేక్ను కట్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వద్దా అభిమానులు సందడి చేశారు. కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ స్టేడియానికి దారి తీసే మార్గాల్లో బ్యానర్ల, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లను నెలకొల్పారు.

ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్..తనదైన శైలిలో విరాట్ కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఒడిశా తీరంలో పూరీ బీచ్ వద్ద కోహ్లీ సైకత శిల్పాన్ని తయారు చేశారు. స్టేడియాన్ని తీర్చిదిద్ది, దాని మధ్యలో కోహ్లీ ముఖచిత్రాన్ని ఇసుకతో చిత్రీకరించారు. దీన్ని చూడటానికి అభిమానులు పోటెత్తారు.