న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మూడు విజయాలతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. భారత్ తరువాత న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
తన తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. ఈ నెల 19వ తేదీన పుణేలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రత్యర్థి జట్టు ఆశించిన స్థాయిలో బలంగా లేకపోవడం వల్ల వరుసగా నాలుగో విజయంపై భారత జట్టు కన్నేసినట్టే. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తన మూడో మ్యాచ్లో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది భారత్.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 పరుగులకే చతికిలపడింది. ఇక్కడా ఛేజింగే. ఈ స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి కొట్టేసింది. ఏడు వికెట్లతో విజయదుందుభి మోగించింది. ఈ మూడింట్లోనూ టీమిండియా రెండోసారి బ్యాటింగ్ చేసింది. ఛేజింగ్ కింగ్ అనిపించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లల్లోనూ భారత్ సమష్ఠిగా రాణించిన మ్యాచ్ ఇది.
ఈ మ్యాచ్ నిర్వహణపై పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్ మిక్కీ అర్థర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీన్ని బీసీసీఐ ఈవెంట్గా అభివర్ణించారాయన. ఈ మ్యాచ్.. ఐసీసీ నిర్వహించినట్లుగా లేదని, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా సాగిందని ధ్వజమెత్తారు. ఐసీసీ ఈవెంట్గా కాకుండా రెండు దేశాల మధ్య జరిగే ఓ ద్వైపాక్షిక సిరీస్లా ఉందని ఆరోపించారు.
మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో, ఆ తరువాతా తమ దేశ జట్టు ప్లేయర్లను ఉత్సాహ పర్చడానికి దిల్ దిల్ పాకిస్తాన్ పాటను ప్లే చేయనివ్వకపోవడం పట్ల మిక్కీ అర్థర్ విమర్శలు గుప్పించాడు. ఇతర దేశాల ప్లేయర్లు, వారి అభిమానులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన బీసీసీఐ.. పాకిస్తాన్తో మ్యాచ్ అనేసరికి ఆంక్షలను విధించిందని వ్యాఖ్యానించాడు.
దీనిపై తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పందించింది. మిక్కీ అర్థర్ చేసిన విమర్శలపై సమీక్ష నిర్వహిస్తామని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. ప్రతి అర్థవంతమైన విమర్శలను తాను స్వీకరిస్తామని, అలాంటి ఉదంతం మళ్లీ పునరావతృ కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రతి ఈవెంట్ నిర్వహించేటప్పుడూ విమర్శలు, సూచనలు వస్తూనే ఉంటాయని, వాటిని సమీక్షించి అవసరమైన సవరణలను చేస్తుంటామని గ్రెగ్ బార్క్లే అన్నారు. ఈ దిశగానే మిక్కీ అర్థర్ విమర్శలను తీసుకుంటామని, వాటిని సద్విమర్శలుగానే తీసుకుంటామని వ్యాఖ్యానించారు. రివ్యూ తరువాత అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.