సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో ఆసక్తికరమైన పోరు సాగుతోంది. రెండు దిగ్గజాలు తలపడుతున్నాయి. హైఓల్టేజ్ మ్యాచ్ ఇది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం దీనికి వేదిక. ఇప్పటివరకు ఓటమి రుచి చూడని రెండు జట్లు భారత్, న్యూజిలాండ్ ఢీ కొడుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని అంచనాలు తప్పుకాలేదు. ప్రారంభ ఓవర్లల్లో బ్లాక్ క్యాప్స్ తడబడుతున్నారు. ఓపెనర్లను కూడా త్వరగానే కోల్పోయింది. డెవాన్ కాన్వే పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు.

భారత బౌలర్లను ఎదుర్కొనడంలో కాన్వే విఫలం అయ్యాడు. ఎనిమిది బంతులను ఆడినా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో తొమ్మిదో బంతికి అవుట్ అయ్యాడు. సిరాజ్ వేసిన ఫుల్లర్ను ఫ్లిక్ షాట్ ఆడబోయాడు కాన్వే. టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా అందుకున్నాడు. కుడివైపు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు.
మరో ఓపెనర్ విల్ యంగ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిల్చోలేకపోయాడు. మహ్మద్ షమీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టంప్స్ దగ్గరగా వేసిన షార్ట్ బంతిని స్క్వేర్ లెగ్ దిశగా ఆడబోయాడు విల్ యంగ్. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను ఎగురగొట్టింది. 19 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. ప్రస్తుతం క్రీజ్లో రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్ ఉన్నారు. దూకుడుగా ఆడుతున్నారు.
కాగా 10 ఓవర్ ముగిసిన తరువాత కేప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ వదిలి వెళ్లడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో డారిల్ మిఛెల్ ఆడిన షాట్ను ఆపబోయి కింద పడ్డాడు రోహిత్. దీనితో అతని చేతి వెేళ్లు నలిగిపోయాయి. వాచిపోయినట్లు కనిపించాయి.
నొప్పితో కొద్దిసేపు విలవిల్లాడాడు రోహిత్. గ్రౌండ్ను వదిలి వెళ్లాడు. రోహిత్ ఫీల్డ్ను వదిలి వెళ్లడంతో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కేప్టెన్గా వ్యవహరించాడు. తన నిర్ణయానికి అనుగుణంగా బౌలర్లను మార్చాడు. 12వ ఓవర్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ మళ్లీ ఫీల్డ్లోకి వచ్చాడు.