Rachin Ravindra: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో అద్భుతాలను సృష్టిస్తోన్న ప్లేయర్.. రచిన్ రవీంద్ర. తన పేరు మీద సరికొత్త రికార్డులను రచిస్తోన్నాడీ న్యూజిలాండ్ పించ్ హిట్టర్. ఇప్పటికే మూడు సెంచరీలను బాదాడు. రెండు హాఫ్ సెంచరీలను అందుకున్నాడు. గ్రూప్ దశలో టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లల్లో రచిన్ రవీంద్ర 565 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతనే ఈ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్. ఇది అతని తొలి వరల్డ్ కప్ టోర్నమెంట్ అయినప్పటికీ.. ఎక్కడా బెరుకు లేకుండా ఆడుతున్నాడు. స్టైలిష్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాడు.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్తో జరుగిన మ్యాచ్లో రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు. ఈ టోర్నమెంట్లో ఇది అతని ముడో సెంచరీ. ఇదివరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్పై సెంచరీ అందుకున్నాడు. ఇది అతని మొట్టమొదటిది.
దాని తరువాత ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ నిర్దేశించిన 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 89 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో అయిదు పరుగుల తేడాతో మాత్రమే ఓడింది న్యూజిలాండ్.
ఈ దూకుడుతో అతనిపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కన్నేశాయి. ఆయా ఫ్రాంఛైజీల రాడార్లోకి వెళ్లాడు రచిన్. ఈ సారి మెగా ఆక్షన్లో అతని కోసం కోట్ల రూపాయలను ధారపోయడానికి సిద్ధపడ్డాయి కూడా. ఇదే విషయాన్ని ఒకట్రెండు ఫ్రాంఛైజీలు సైతం స్పష్టం చేశాయి. రచిన్ రవీంద్ర ఐపీఎల్లో అడుగు పెట్టాలని నిర్ణయిస్తే తాము తీసుకుంటామనీ స్పష్టం చేశాయి.

రచిన్ రవీంద్ర మనసు మాత్రం మరోలా ఉంది. అతని ఫేవరెట్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఇందులో చోటు దక్కాలని కోరుకుంటోన్నాడు. తనకు ఇష్టమైన ఐపీఎల్ టీమ్ ఆర్బీబీయేనని వెల్లడించాడు. అవకాశం వస్తే ఆ జట్టు తరఫున ఆడతాననీ వ్యాఖ్యానించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తన ఫేవరెట్ గ్రౌండ్గా చెప్పాడు రచిన్.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరింత క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటోన్నానని చెప్పాడు. ఇక్కడి ప్రేక్షకులు తనకు పూర్తిగా మద్దుతు పలికారని, ఈ స్టేడియానికి, ఇక్కడి అభిమానులకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని వివరించాడు.