సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.
తన తదుపరి మ్యాచ్ నేడు ఆడబోతోంది టీమిండియా. బలమైన న్యూజిలాండ్ను ఎదుర్కొనబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆరు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి.
ప్రస్తుతం వరల్డ్ కప్ 2023లో మెజారిటీ మ్యాచ్లల్లో పరుగుల వరద పారిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్పై దక్షిణాఫ్రికా చెలరేగింది. 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు కూడా దక్షిణాఫ్రికా భారీగా పరుగులు చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ కూడా ఇంతే. 300లు అనేవి కామన్ అయిపోయాయి ఈ వరల్డ్ కప్లో. అలవోకగా షాట్లు ఆడుతున్నారు బ్యాటర్లు.

ఆ పరిస్థితి భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్లో సాధ్యపడకపోవచ్చు. పరుగులు చేయడానికి బ్యాటర్లు చెమటోడ్చక తప్పదనే అంచనాలు ఉన్నాయి. రోహిత్ సేన గానీ, బ్లాక్ క్యాప్స్ గానీ.. పరుగులు చేయడం కష్టపడటం తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అకాడమీ స్టేడియం పిచ్పై టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తన తాజా అంచనాలను వెల్లడించాడు. పిచ్ మందకొడిగా ఉండొచ్చని చెప్పాడు. ఈ పిచ్పై పరుగులు సాధించడానికి బ్యాటర్లు కష్టపడాల్సి వస్తుందని వ్యాఖ్యానించాడు.