ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ను 160 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లీగ్ దశను విజయంతో ముగించింది. 9-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.
ఈ విజయంతో లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును నెలకొల్పింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్లల్లోనూ విజయదుందుభి మోగించింది. తొమ్మిది విజయాలు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఆ తరువాతి మూడు స్థానాలో ఉన్నాయి.

ఈ నెల 15, 16 తేదీల్లో ఈ రెండు సెమీ ఫైనల్స్ నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి సెమీ ఫైనల్.. భారత్- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియంలో.. రెండోది దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగనున్నాయి. 19వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది.
తొలి సెమీ ఫైనల్స్పై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు.. తమ తమ అంచనాలను వెల్లడిస్తోన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అంచనా. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈ జాబితాలో చేరాడు. తొలి సెమీస్లో గెలిచే జట్టు ఏదో వెల్లడించాడు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఓ చిన్న ప్రొమోను విడుదల చేసింది.
2023 వరల్డ్ కప్ చేరిన టీమ్ ఇండియా అంటూ మొదలవుతుంది ఈ ప్రొమో. న్యూస్ పేపర్ చేతిలో పట్టుకుని ఈ హెడ్ లైన్ను చదువుతాడు అక్కినేని నాగచైతన్య. ఫ్యూచర్ డిసైడ్ చేసి తాను చెప్పట్లేదని, జట్టు పెర్ఫార్మెన్స్, దూకుడును చూస్తే మీకే అర్థమౌతుందనీ వివరించాడు. తాను ఒక్కడినే కాదని, ఇండియా మొత్తం ఇదే కోరుకుంటోందని పేర్కొన్నాడు. టీమిండియా దూత (Dhoota) గా జర్నలిస్ట్.. సాగర్ అంటూ ముగించాడు.
దూత వెబ్ సిరీస్లో నటించాడు నాగచైతన్య. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకొంటోంది. డిసంబర్ 1వ తేదీన విడుదల కానుంది ఈ సిరీస్. ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతు, తరుణ్ భాస్కర్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. సూపర్ నేచురల్ హారర్ జానర్లో రానుందీ వెబ్ సిరీస్.