ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో నేడు బిగ్ డే. సెమీ ఫైనల్స్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు, రేపు రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి సెమీ ఫైనల్స్లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీనికి వేదిక.. ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
రెండో సెమీస్ కోల్కత ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. 19వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండింటిపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. టీమిండియా గెలిచి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఇంగ్లాండ్లో 2019లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో ఇదే న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. పైగా ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్లల్లో న్యూజిలాండ్ను ఓడించిన చరిత్ర టీమిండియాకు ఎప్పుడూ లేదు. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. న్యూజిలాండ్ గండాన్ని ఎలా అధిగమిస్తుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
దీనితో అభిమానులు ఇక ఆలయాలకు పరుగులు పెడుతున్నారు. ఈ తెల్లవారు జాము నుంచే దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్లేయర్ల ప్లకార్డులను ప్రదర్శిస్తూ అభిమానులు పూజలు, యాగాలు చేస్తోన్నారు.
తాజాగా స్పోర్ట్స్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియాకు సలహాలను ఇచ్చాడు. టాస్ గెలిస్తే మాత్రం టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోకూడదని సూచించాడు. తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపాలని అన్నాడు. ఫీల్డింగ్ కాకుండా బ్యాటింగ్కు దిగడానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాడు.
తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటే మాత్రం కష్టాలు తప్పవని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. ముంబైలో సమయం గడుస్తున్న కొద్దీ మంచు పడుతుందని, ఛేజింగ్ సమయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసినా టీమిండియా స్కోర్ బోర్డ్ 300 పరుగుల వద్దే ఆగొచ్చని చెప్పాడు.
భారత్ 330కి పైగా పరుగులు చేస్తుందని తాను అనుకోవట్లేదని ఆకాశ్ చోప్రా వివరించాడు. బౌలింగ్ ఎంచుకుంటే.. మంచు కురిసే సమయానికే బౌలింగ్ను ముగించుకోవడానికి అవకాశం ఉంటుందని, గతంలో ఇలాంటి సందర్భాలను ఎదుర్కొన్న అనుభవం భారత బౌలర్లకు ఉందని చెప్పుకొచ్చాడు.