Virender Sehwag: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. న్యూజిలాండ్, శ్రీలంక మినహా అన్ని జట్లూ ఒకటి చొప్పున మ్యాచ్ను ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఈ నెల 12వ తేదీన భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ వరల్డ్ కప్లో అదే చిట్టచివరిది. దీని తరువాత సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్.

గ్రూప్ దశలో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. బెంగళూరులో శ్రీలంకను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లల్లో 171 పరుగులకు ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 23.2 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి ఛేదించారు బ్లాక్ క్యాప్స్.
ఈ విజయంతో తన సెమీ ఫైనల్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సెమీస్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సరసన చేరినట్టయింది. ఇంగ్లాండ్పై జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి తీరుపై ఇది ఆధారపడి ఉంది. భారీ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించగలిగితేనే పాకిస్తాన్కు సెమీ ఫైనల్స్ అవకాశాలు ఉంటాయి.
తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్కు దిగితే 300 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇంగ్లాండ్ను 13 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్కు దిగి 300 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆరు ఓవర్లలోనే కొట్టాల్సి ఉంటుంది. అలా జరిగితేనే పాకిస్తాన్ నెట్ రన్రేట్ మెరుగు పడుతుంది. అది సాధ్యం అయ్యే పని కాదు. దీన్ని బట్టి చూస్తే- న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ స్థానం ఖరారైనట్టే.
సెమీ ఫైనల్స్ చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోండటం పట్ల పాకిస్తాన్పై విమర్శలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్కే చెందిన మాజీలు ఆ జట్టుపై నిప్పులు చెరుగుతున్నారు. వసీం అక్రమ్ వంటి లెజెండరీ ప్లేయర్లు జట్టు ఆడిన తీరును తప్పుపడుతున్నారు. ఎలాంటి వ్యూహాలు లేకుండా ఆడిందంటూ ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. వారితో జత కలిశాడు. ఘాటుగా స్పందించాడు. పాకిస్తాన్ వైఫల్యాలను ఎండగట్టాడు. తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఆ జట్టుకు బైబై చెప్పాడు. కేప్టెన్ బాబర్ ఆజమ్ సహా టీమ్ మొత్తానికీ గుడ్ బై చెప్పాడు. సేఫ్ ఫ్లైట్ జర్నీ టు పాకిస్తాన్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేశాడు.
అక్కడితో వదల్లేదు. తమ దేశంలో పాకిస్తాన్ జట్టుకు అతిథి మర్యాదలు బాగానే జరిగి ఉంటాయని, ఎలాంటి లోటూ వచ్చి ఉండదని వ్యాఖ్యానించాడు. బిరియానీ టేస్ట్ వారికి నచ్చి ఉంటుందని సెటైర్ వేశాడు. పాకిస్తాన్ ఏ జట్టును సపోర్ట్ చేస్తే ఆ జట్టు పాకిస్తాన్ లాగే ఆడుతుందనీ ఎద్దేవా చేశాడు. బైబై పాకిస్తాన్.. సేఫ్ ఫ్లైట్ జర్నీ అంటూ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ పెట్టాడు వీరూ.