ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ను 160 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లీగ్ దశను విజయంతో ముగించింది. 9-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.
ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 19వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. తొలి సెమీ ఫైనల్లో భారత్- న్యూజిలాండ్, రెండో సెమీస్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియం, కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్ ఈ రెండు సెమీస్కు ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి.

లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో- ఫాక్స్ క్రికెట్ తన వరల్డ్ కప్ 2023 టీమ్ను ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నింట్లో సత్తా చాటిన ప్లేయర్లతో ఈ జట్టును రూపొందించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లల్లో మెరుపులు మెరిపించిన ప్లేయర్లకు ఈ జట్టులో చోటు కల్పించింది.
ఈ జట్టుకు కేప్టెన్గా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను అపాయింట్ చేసింది ఫాక్స్ క్రికెట్. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్, టాప్ ఆర్డర్లో రచిన్ రవీంద్ర, అస్మతుల్లా ఒమర్జాయ్ను తీసుకుంది. మిడిలార్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్కు చోటు కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఆల్రౌండర్ అస్మతుల్లా ఒమర్జాయ్.
ఈ వరల్డ్ కప్లో ఆడిన తొమ్మిది మ్యాచ్లల్లో 353 పరుగులు చేశాడు ఒమర్జాయ్. ఏడు వికెట్లు పడగొట్టాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, మార్కొ జెన్సెన్కు స్థానం ఇచ్చింది ఫాక్స్ క్రికెట్. స్పెషలిస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ఆడమ్ జంపా, దిల్షాన్ మదుశంకను ఎంపిక చేసింది. ఇక 12వ ఆటగాడిగా భారత్కే చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని సెలెక్ట్ చేసింది.
తుదిజట్టులో- క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర, అస్మతుల్లా ఒమర్జాయ్, గ్లెన్ మ్యాక్స్వెల్, రవీంద్ర జడేజా, మార్కొ జెన్సెన్, జస్ప్రీత్ బుమ్రా, ఆడమ్ జంపా, దిల్షాన్ మదుశంకలు ఉన్నారు. 12వ ఆటగాడిగా మహ్మద్ షమీకి చోటు దక్కింది.