ఇస్లామాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ను 160 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లీగ్ దశను విజయంతో ముగించింది. 9-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.
9-0తో..
ఈ విజయంతో లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును నెలకొల్పింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్లల్లోనూ విజయదుందుభి మోగించింది. తొమ్మిది విజయాలు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఆ తరువాతి మూడు స్థానాలో ఉన్నాయి.

సెమీస్ యుద్ధానికి సన్నద్ధం..:ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 19వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. తొలి సెమీ ఫైనల్లో భారత్- న్యూజిలాండ్, రెండో సెమీస్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియం, కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్ ఈ రెండు సెమీస్కు ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి.
రోహిత్ హాఫ్ సెంచరీ..:ఈ మ్యాచ్లో కేప్టెన్ రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీ చేశాడు. 54 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్తో కలిసి సెంచరీ పార్ట్నర్షిప్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్- 51, విరాట్ కోహ్లీ-51 పరుగులతో చెలరేగగా.. ఆ తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జెంచరీలతో కదం తొక్కారు.
వసీం అక్రమ్ ప్రశంసలు..:రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా రాణిస్తోండటం పట్ల పాకిస్తాన్ మాజీ కేప్టెన్, లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. భారీ స్కోర్ చేయాలనే లక్ష్యంతోనే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుందని వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ వంటి కేప్టెన్ ప్లస్ బ్యాటర్ ప్రపంచంలో మరొకరు ఉండరని అన్నాడు.
అలవోకగా షాట్లు.. :ఈ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ గానీ, కేఎల్ రాహుల్ గానీ.. అంచనాలకు మించి రాణించారని, టీమిండియా ఛాంపియన్గా ఆవిర్భవిస్తే- అందులో సగం క్రెడిట్ వారిద్దరికే దక్కుతుందని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. క్రీజ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే ప్లేయింగ్ టెంపోనే మార్చివేయగల సత్తా వారిద్దరికీ ఉందని అన్నాడు.