కోల్కత: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది టీమిండియా. వరుసగా ఎనిమిది విజయాలను సాధించింది. సెమీ ఫైనల్స్లో అడుగు పెట్టిన మొట్టమొదటి జట్టు ఇదే. ఆ తరువాతే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వచ్చి చేరాయి. ఈ నాలుగు జట్లు వరల్డ్ కప్ కోసం పోరాడనున్నాయి.
తన చివరిదైన గ్రూప్ మ్యాచ్ను ఈ నెల 12వ తేదీన ఆడబోతోంది భారత్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్తో తలపడుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. దీని తరువాత సెమీ ఫైనల్స్ కోలాహలం ఆరంభమౌతుంది. 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్, 19వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఎదుర్కొనబోతోంది భారత్.

ఈ వరుస విజయాల్లో కెేప్టెన్గా, జట్టు ఓపెనర్గా కీలక పాత్రను పోషిస్తోన్నారు బౌలర్లు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో కూడిన బౌలింగ్ డిపార్ట్మెంట్ అత్యంత బలంగా ఉంటోంది. ఎలాంటి బ్యాటర్లనయినా వెన్నులో వణుకు పుట్టించేలా తయారయ్యారు. టీమిండియా ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా చవి చూడలేదంటే అందులో బౌలర్ల పాత్ర కీలకంగా ఉంది.
అలాంటి బౌలింగ్ డిపార్ట్మెంట్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ తక్తో మాట్లాడారు. బౌలింగ్ విభాగం పనితీరు పట్ల కొద్దిగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదివరకు జట్టులో కొనసాగిన పేసర్లతో ఇప్పుడున్న ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని ఏమాత్రం కంపేర్ చేయలేమని అన్నారు.
ఇప్పడు ఉన్నది అత్యుత్తమ పేస్ అటాక్ అని తాను అనలేనని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఫాస్ట్ బౌలర్ల జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బాగా బౌలింగ్ చేయగులుగుతున్నారని మాత్రమే చెప్పగలనని అన్నారు. అంతకుమించి- బౌలింగ్ త్రయం అద్భుతం అనే మాటను అనలేనని పేర్కొన్నారు.
2003 నాటి ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్.. అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబిచ్చారు. ఆ ముగ్గురితో ఈ ముగ్గురినీ పోల్చి చూడలేమని గంగూలీ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న ముగ్గురిలో జస్ప్రీత్ బుమ్రా కొంత వైవిధ్యంగా బంతులను సంధించగలుగుతాడని అన్నారు. షమీని ఆలస్యంగా తుదిజట్టులోకి తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు.