లక్నో: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భారత్.. ఆదివారం తన తదుపరి మ్యాచ్ను ఆడబోతోంది. ఇంగ్లాండ్ను ఢీ కొట్టబోతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు లక్నో చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్లో తలమునకలయ్యాయి.
రోహిత్ సేన దూకుడు చూస్తోంటే టీమిండియా గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్. ఇప్పటివరకు ఓటమి ఎరుగని తిరుగులేని జట్టు ఇదొక్కటే. ఆడిన అయిదు మ్యాచుల్లోనూ విజయఢంకా మోగించింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు టీమిండియా ముందు మోకరిల్లాయి.

కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. ఇలా బ్యాటర్లు, బౌలర్లు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాను ఎదుర్కొనడం, ఓడించడం అంటే మాటలు కాదు.
ఇంగ్లాండ్ దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితిలో ఉంది. అగ్ని పరీక్ష వంటి మ్యాచ్ ఇది. వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్ చేరాలంటే భారీ తేడాతో టీమిండియా ఓడించాల్సి ఉంటుందా జట్టుకు. గెలిచినా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కూడా. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్లు ఆడగా నాలుగింట్లో దారుణంగా ఓడింది. చివరికి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో కూడా పరాజయాన్ని చవి చూసింది.
భారత్ సహా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్లతో తన తదుపరి మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఆ జట్టు సెమీస్ చేరుకుంటుందనే ఆశలు ఎవరికీ పెద్దగా లేవు. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్యే సెమీ ఫైనల్స్ ఉంటాయనే అంచనాలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి. ఇప్పుడు టీమిండియా దూకుడు చూస్తోంటే సెమీస్లో ప్రత్యర్థి ఎవరైనా భారత్ ఖచ్చితంగా గెలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
జట్టు మొత్తం ఫామ్లో ఉన్న సమయంలో తుదిజట్టు ఎంపిక టీమిండియా మేనేజ్మెంట్కు సవాల్గా మారింది. ఎవరిని తీసుకోవాలి? ఎవరిని బెంచ్కు పరిమితం చేయాలి? అనే విషయంపై కసరత్తు సాగిస్తోంది. లక్నోపిచ్ మందకొడిగా ఉండటం, బౌలర్లకు ఎక్కువగా సహకరించే అవకాశం ఉండటం వల్ల స్పెషలిస్ట్ స్పిన్నర్ను ఆడించవచ్చు. రవిచంద్రన్ అశ్విన్కు తుదిజట్టులో చోటు దక్కొచ్చు.
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. శుభ్మన్ గిల్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్ ఆరంభిస్తాడు. 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తరువాత శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ 4, 5 స్థానాల్లో ఆడొచ్చు. సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటే 6వ స్లాట్ అతనిదే అవుతుంది.
ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్లల్లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తమ స్థానాలను ఖాయం చేసుకున్నట్టే. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. ఇక్కడే సమస్యలొస్తోన్నాయి. ఎక్స్ట్రా బౌలర్ను తీసుకోవాలనుకుంటే రవిచంద్రన్ అశ్విన్కు ప్లేయింగ్ 11లోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. పేసర్ వైపు మొగ్గు చూపితే మహ్మద్ షమీకి చోటు దక్కుతుంది.