అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్లో భారత్ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో భారత్తో తలపడుతుంది.
కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో గురువారం రాత్రి జరిగిన సెమీస్లో తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లల్లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ 101తో జట్టును ఆదుకోవడం వల్ల ఆ కాసిన్ని పరుగులైన చేయగలిగింది దక్షిణాఫ్రికన్లు.

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం అహ్మదాబాద్లో ఫైనల్స్లో భారత్ను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ కోసం నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. సహా పలువురు ప్రముఖులు మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో- నరేంద్ర మోదీ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది గుజరాత్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించనుంది. పారా మిలటరీ, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళాలను రంగంలోకి దించనుంది. స్టేడియానికి వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలను మళ్లించనుంది.
కాగా- ఈ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కేప్టెన్కు ప్రధాని మోదీ ట్రోఫీని అందించే అవకాశాలు ఉన్నాయి. మోదీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ లక్ ఎవరికి ఉందనేది ఆదివారం రాత్రికి తెలిసిపోతుంది. ఇప్పటివరకు ఇలాంటి సందర్భం రాలేదు.